భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీరమణ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి న్యాయవ్యవస్థలో సమూల మార్పలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యవర్తిత్వం, రాజద్రోహం, దేశంలో హైకోర్టు పనితీరు గురించి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఓ భార్యాభర్తల కేసును తానే చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించారు. 21 ఏళ్ల తర్వాత వారిని కలిసేలా చేశారు.
ఎన్వీ రమణ చొరవతో..
గుంటూరు జిల్లా గురజాల డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న కళ్లెం శ్రీనివాసశర్మకు 21 ఏళ్ల క్రితం 1998లో శాంతితో వివాహం జరిగింది. 1999లో వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తెలెత్తాయి. అయితే భార్య శాంతి తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ భర్తపై 498 కింద కేసు పెట్టింది. దీంతో గుంటూరు స్ధానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2010లో హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు శిక్ష తగించింది. దీనిపై శాంతి తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు జస్టిస్ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనానికి విచారణకు వచ్చింది. ఇందుకు సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక చొరవ తీసుకొని భార్యభర్తలు కలిసేలా చొరవ తీసుకున్నారు. ఏకంగా సుప్రీం కోర్టులోనే భార్యాభర్తల సమస్యకు పరిష్కారం చూపించి, ఇద్దరినీ ఒక్కటి చేశారు.
మాతృ భాషలో..
నిజానికి సుప్రీం కోర్టు స్థాయిలో కక్షిదారులను కోర్టుకు పిలవరు. వారి తరఫు న్యాయవాదులే వాదిస్తుంటారు. అయితే, ఇక్కడే జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సుదీర్ఘ కాలంగా దూరంగా ఉన్న భార్యాభర్తల మనోగతాన్ని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వారిద్దరూ కలిసి జీవితంలో ముందుకు సాగేలా వారికి సర్ధి చెప్పారు. బాధితుల వాదనలను తెలుగులోనే విని, మళ్లీ కలిసేలా చొరవ తీసుకున్నారు. ఈ కేసులో సీజేఐ రమణ వ్యవహరించిన తీరు ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 21 ఏళ్ల తర్వాత భార్యాభర్తలు కలిసేలా చొరవ తీసుకున్నందుగాను ఎన్వీ రమణపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Must Read ;- జస్టిస్ ఎన్వీ సంచలనం.. ‘రాజద్రోహం’ పిచ్చోడి చేతిలో రాయి