భారీ విజయంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వరుసగా తాము ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్న మాట ప్రకారం.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతోపాటు, పింఛన్ల పెంపును సమర్థంగా అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా మరో రెండు హామీలను అమలు చేయడానికి రెడీ అయింది. ఈ రెండు హామీలు ఆగస్టులోనే ప్రారంభం కాబోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి తన హామీలు అమలు చేయడం లేదంటూ వైసీపీ ఇప్పటికే గగ్గోలు పెడుతోంది. కొత్త ప్రభుత్వం కాస్త కుదురుకోవడానికి కనీస సమయం కూడా ఇవ్వకుండా జగన్ రెడ్డి హడావుడి పడుతున్నారు. గతంలో వారు చేసిన అవకతవకలు, కుంభకోణాలను అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్లడం కాస్త కష్టమే. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారాల వ్యవధిలోనే తన హామీలకు శ్రీకారం చుడుతోంది.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినప్పటికీ తనకున్న పాలనానుభవంతో సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలును చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేసి.. అభివృద్ధిని మర్చిపోయింది. దీంతో వైసీపీపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీని వద్దనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపుతో లక్షలాది మందికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం.. మరో నెల రోజుల వ్యవధిలో సూపర్ సిక్స్లో ఇచ్చిన ఒక హామీతో పాటు.. మరో ఎన్నికల హామీని అమలు చేయడానికి రెడీ అవుతోంది.
టీడీపీ మొదటిసారి అధికారంలో ఉండగా ఏపీ వ్యాప్తంగా అమలుచేసిన అన్నా క్యాంటీన్ల పథకం మంచి ప్రజాదరణ పొందింది. సామాన్యులు, శ్రమ జీవులు, నిరుద్యుగులు, ఉద్యోగాల కోసం వివిధ కోర్సులు చేసుకుంటూ డబ్బులకు ఇబ్బంది పడే యువత ఎంతో మందికి అన్నా క్యాంటిన్లు ఒక వరం. రూ.5 కే భోజనం అందించే ఈ పవిత్రమైన క్యాంటిన్లను వైసీపీ ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ఏపీలో తెరవనుంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్లో ఈ క్యాంటిన్ల నిర్మాణం చేపడుతున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
సూపర్ సిక్స్ లో మరో పథకం అయిన ఫ్రీ బస్సు సౌకర్యం కూడా అదే నెలలో మొదలు కానుంది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం నడుస్తుంది. ఏపీలో కూడా ఆగష్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.










