Congress Munugodu MLA Raj Gopal Reddy Fires On Minister Jagadish Reddy :
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం అందరికి తెలిసిందే. స్థానిక శాసన సభ్యుడికి కనీసం సమాచారం ఇవ్వకపోవడమేంటని మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ కార్డుల పంపిణీకి వచ్చిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే శత్రువులా చూస్తారా? అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించరా? అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరి నేతల మధ్య నువ్వా.. నేనా అన్నట్టు తగ్గ పోరు నడుస్తుండటంతో నల్లగొండ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న ఎమ్మెల్యే
దళితబంధును హుజురాబాద్ కే పరిమితం చేస్తుండడాన్ని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళిత బంధు పథకాన్ని తన మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజగోపాల్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. అదే సమయంలో రేషన్ కార్డుల పంపిణీకోసం మునుగోడు చౌరస్తా మీదుగా వెళ్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు చేస్తుండటం సరికాదని అన్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
Must Read ;- దళిత బంధు.. హుజురాబాద్ లో ఎందుకు?











