వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా.. ఇది అక్షర సత్యమని చెప్పక తప్పదు. అంతేకాదండోయ్.. ఈ దిశగా సీఎం కేసీఆర్ సూటిగా చెప్పకున్నా.. ఆయన ప్రసంగించిన తీరును చూసినా కూడా పై వాదన నిజమనే చెప్పక తప్పదు. వాస్తవానికి దళిత కుటుంబాల్లో దళిత బంధు వెలుగు నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతు బంధు కంటే కూడా దళిత బంధు కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేస్తుందని కూడా చెప్పక తప్పదు. అయితే సరిగ్గా హుజూరాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైన వేళ.. కేవలం ఆ ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కోసమే అన్నట్లుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తుండటం.. అందులోనూ ఈ పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటూ ఉండటం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోందని చెప్పాలి.
కేసీఆర్ ఏమన్నారంటే..
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడితే..దళిత బంధును ఆపేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు గానీ.. ఆ భావం వచ్చేలా ఇప్పటికే చాలా వ్యాఖ్యలు చేయగా.. తాజాగా సోమవారం ప్రగతి భవన్ వేదికగా దళిత బంధుపై జరిగిన తొలి సమీక్షా సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దిశగా ఆయన ఏమన్నారంటే.. ‘‘తొలుత ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేస్తే, దాని ప్రభావం యావత్ రాష్ట్రంపై ఉంటుంది. హుజూరాబాద్ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటుంది. దళితబంధు అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు.. ఒక ఉద్యమం. ఈ పథకం విజయవంతం కావడానికి అందరూ దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. మనందరిలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలి. పరస్పర అనుబంధాలను పెంచుకుంటేనే విజయానికి బాటలు పడతాయి. తెలంగాణ ఉద్యమం ఒక్కడితో ప్రారంభమై, భారతీయ రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, విజయం సాధించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని కేసీఆర్ తనదైన స్టైల్లో చెప్పుకుపోయారు.
అప్పటికే గొప్ప పథకంపై నీలినీడలు..
దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దళిత బంధు లాంటి పథకాన్ని హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ప్రారంభించడం, అది కూడా ఆ నియోజకవర్గాన్నే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకోవడంతోనే ఈ పథకంపై నీలినీడలు కమ్ముకుమన్నాయని చెప్పాలి. కేవలం హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయమే పరమావధిగా ఇప్పటికే కేసీఆర్ సర్కారు చాలా అడుగులే వేసింది. ఇలాంటి నేపథ్యంలో దళిత బంధును కూడా హుజూరాబాద్ లోనే ప్రారంభించడం, అక్కడ ఈ పథకం విజయంపైనే.. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం ఆధారపడి ఉంటుందని బహిరంగంగానే చెప్పడం చూస్తుంటే.. ఒకవేళ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడితే..దళిత బంధును ఆపేస్తారన్న వాదనలు అంతకంతకూ పెంచేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- దళిత బంధుతో సారు కొంప కొల్లేరే!