పాకిస్తాన్ కూ, బాలీవుడ్ దిగ్గజాలకూ ఉన్న అవినాభావ సంబంధం మామూలుది కాదు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో. ముఖ్యంగా పెషావర్ తో ఈ బంధం పెనవేసుకుపోయింది. వీరికి అక్కడ సొంత ఆస్తులు కూడా ఉన్నా వాటిని అమ్మేశారు. ఇప్పుడు వారి పూర్వికుల ఆస్తి వివాదం కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ బాలీవుడ్ నటులు ఎవరనుకుంటున్నారా? ఒకరు దిలీప్ కుమార్ అయితే ఇంకొకటి కపూర్స్ కుటుంబం. పృధ్వీరాజ్ కపూర్ ఫైసలాబాద్ లో జన్మించారు. ఆయన కుమారుడు రాజ్ కపూర్ పెషావర్ లోని కపూర్ హవేలీలో పుట్టారు.
రాజ్ కపూర్ వారసులు వారసులు బాలీవుడ్ లో ఎంతోమంది ఉన్న సంగతి తెలిసిందే. ఇక దిలీప్ కుమార్ విషయానికి వస్తే ఆయన కూడా పెషావర్ లోని ఖిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలో 1922లో జన్మించారు. బాలీవుడ్ లో నటులుగా స్థిరపడ్డాక అక్కడ వారి పూర్వికులు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని ఆమ్మేశారు. పెషావర్ లో దిలీప్ కుమార్ పూర్వికుల ఇల్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ఇంటిని తమ వారసత్వ సంపదగా భావిస్తోంది. అందులో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇప్పుడు అందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఆ ఇల్లు ఇప్పుడు హాజీలాల్ మహమ్మద్ అధీనంలో ఉంది. దాన్ని దిలీప్ కుమార్ రూ. 51 లక్షలకు హాజీలాల్ కు అమ్మేశారు. ప్రభుత్వం అందులో మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుని దాన్ని అమ్మాల్సిందిగా హాజీలాల్ పై ఒత్తిడి తెస్తోంది. ఆ ఇల్లు 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దానికి రూ. 80. 56 లక్షలకు ఇవ్వడానికి ప్రభుత్వవం సిద్ధపడింది. ససేమిరా ఆ ధరకు ఇవ్వనంటున్నాడు హాజీలాల్. రూ. 25కోట్లకు తగ్గేది లేదంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చే ధర తనకు ఎంతమాత్రమూ గిట్టుబాటు కాదన్నది అతని వాదన. అతను 2005లో ఆ ఇంటిని కొన్నాడు. ప్రస్తుతం అక్కడ 25 చదరపు మీటర్ల స్థలం ధర రూ. 5 కోట్ల వరకూ ఉందట.
ఆ ప్రకారం ధర చెల్లిస్తే అమ్మటానికి తనకు అభ్యంతరం లేదని అతను అంటున్నాడు. తాను కొన్న 16 ఏళ్ల తర్వాత ఇలాంటి ధర ఇస్తానని అనడం అన్యాయం అన్నది అతని వాదన. రాజ్ కపూర్ ఆస్తి విషయంలో ఇలాంటి వివాదమే నడిచింది. రాజ్ కపూర్ పూర్వికుల ఇల్లు 151.75 చదరపు మీటర్ల స్థలంలో ఉంది. దానికి ఆ ఇంటి యజమాని రూ. 200 కోట్లు కావాలని అడిగాడు. ప్రభుత్వం కోటిన్నర మాత్రమే ఇస్తానంది. రాజ్ కపూర్ పూర్వికుల నివాసాన్ని కపూర్ హవేలి అని పిలుస్తుంటారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్ లో ఉంది. దీన్ని 1918-1922 మధ్య రాజ్ కపూర్ తాత దేవన్ బాషేశ్వర్నాథ్ కపూర్ నిర్మించారు.
ఈ భవంతిని కూడా ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ రెండు భవనాల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. నగరం నడిబొడ్డున ఈ భవనాలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 2.35 కోట్లు విడుదల చేయడానికి జనవరిలోనే ఆమోదించింది. వీటి యజమానులు మాత్రం వీటిని కూలగొట్టి కమర్షియల్ కాంప్లెక్సులు కట్టాలనుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ముఖ్యంగా పురావస్తు శాఖ ఈ భవనాల చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించి వీటిని సంరక్షించాలని భావిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో చూడాలి. ప్రభుత్వం ధర విషయంలో ఒక మెట్టు దిగివస్తే తప్ప ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేలా లేదు.
-హేమసుందర్ పామర్తి