త్వరలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో .. అమరావతి దగ్గర హైవే విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతోపాటు.. వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందని ప్రకటించిన కేంద్రం అమరావతి నిర్మాణానికి రూ. 15వేల కోట్లను కేటాయించగా.. అవి కాకుండా ఇప్పుడు రోడ్ల అభివృద్ధి కోసం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటోంది.
ఇందుకు సంబంధించిన విషయాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని పెమ్మసాని తెలిపారు. వినుకొండ- గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించి.. దానిని కాస్త మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ.. రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఈ హైవే .. రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని… గుంటూరుకు మరో ఔటర్ రింగ్రోడ్డులా మారుతుందన్నారు. ఈ రోడ్డు మార్గాన్ని పూర్తిగా ఎన్హెచ్ఏఐ నిర్మిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్తు తదితర పనులు వెంటనే చేపట్టాల్సి ఉందని.. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి వివరించారు.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు గుంటూరులోని శీతల గిడ్డంగుల్లో మిర్చిని దాచుకుంటే, వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువచ్చి, మంచి ధర కోసం శీతల గోదాముల్లో దాచుకుంటే ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు మోసానికి పాల్పడటం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకోవడం బాధను కల్గించిందని అన్నారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకుని రావడం బాధనిపించిందన్నారు. నిందితులను అరెస్టు చేసి.. వారి ఆస్తులు అటాచ్ చేసేందుకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. మోసం చేసిన నకిలీ రైతులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల్ని మోసం చేయడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కావాలనే ఆత్మహత్య నాటకానికి తెర తీశారని మండిపడ్డారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఆసుపత్రి వర్గాలు సైతం అలాంటి వారికి సహకరించవద్దని సూచించారు. రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. పనుల్లో నాణ్యత, ప్రమాణాలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్యూబీలో నీళ్లు వస్తున్నాయని.. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి అధికారులను ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ పశ్చిమం వైపు కొత్తగా నిర్మించిన ప్లాట్ఫాంపై టైల్స్ లేచిపోవడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా.. వర్షాల వల్ల ఆర్యూబీలోకి నీళ్లు వస్తున్నాయి.. ఇంకా పనులు జరుగుతుండటంతో ట్రాక్టర్లు రావడంతో టైల్స్ పాడైపోయాయని అధికారులు కేంద్రమంత్రికి సమాధానమిచ్చారు.
అక్కడ పనులు పూర్తి కాకముందే టైల్స్ ఎందుకు వేయాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో పనుల కోసం కేంద్రం నుంచి రూ.కోట్లు నిధులు మంజూరవుతున్నా పనుల్లో నాణ్యత కనిపించడంలేదన్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్న నిధులతో చేపట్టే పనులపై ఇంజినీర్ల పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇకపై ప్రతి నెలా రైల్వే పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష చేస్తానని వారితో చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అవసరాలను గుర్తించి అవసరమైన పనులు చేపట్టేందుకు నివేదికలు తయారుచేయాలని అధికారుల ఆదేశించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అవసరమైతే కేంద్రం నుంచి ఇందుకు కావలసిన నిధులను రాబట్టేవిధంగా తాను కృషి చేస్తానని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.











