కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు సాగు రంగంలో తీసుకు వస్తున్న కొత్త చట్టాలను నిరసిస్తూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని అష్ట దిగ్బంధనం చేసిన రైతులు… నరేంద్ర మోడీ సర్కారుకు నిజంగానే లిట్మస్ టెస్ట్ పెట్టేశారనే చెప్పాలి. సాగు రంగంలో మోడీ సర్కారు తీసుకువస్తున్న సంస్కరణలు తమకు మేలు చేయడం మాట అటుంచితే… ఇప్పుడున్న స్థితికంటే మరింత దిగజారేలా చేయనున్నాయన్న వాదనతో అన్నదాతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంస్కరణలపై మోడీ సర్కారు ముందడుగు వేస్తుందా? లేదంటే… వెనకడుగు వేయక తప్పదా? అన్నది గురువారం తేలిపోనుంది. మొత్తంగా ఇప్పటిదాకా తాను తీసుకున్న నిర్ణయానికి తిరుగు లేదన్న రీతిలో వ్యవహరించిన మోడీకి ఇప్పుడు అన్నదాతల ఆందోళనలు నిజంగానే లిట్మస్ టెస్ట్ పెట్టేశాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
వ్యవసాయమే శ్వాసగా..
భారత దేశం ప్రధానంగా వ్యవసాయమే శ్వాసగా సాగుతున్న దేశం. ఈ నేపథ్యంలో మిగిలిన రంగాల మాట ఎలా ఉన్నా సాగు రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… అది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర లేపడం సర్వసాధారణమే. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, జమ్మూ కశ్మీర్ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టడం వంటి సంచలనాత్మక నిర్ణయాలను నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్నా జనంలో అంతగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. తాను ఏం చేసినా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా చేస్తున్నానని చెప్పిన మోడీ మాటను జనం కూడా కాస్తంత కష్టమైనా కూడా సర్దుకున్నారు. ఇలాంటి తరుణంలో దేశానికి వెన్నెముక లాంటి సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకంటూ మోడీ సర్కారు ఇప్పుడు దేశీయ వ్యవసాయ రంగంలో పెను సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్కరణలు ఎలాంటివన్న విషయం తెలుసుకున్నంతనే యావత్తు దేశ రైతాంగం భగ్గుమన్నది. మోడీ సర్కారు తీసుకువచ్చే సంస్కరణలు తమకు కాకుండా కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేవేనన్న వాదనతో అన్నదాతలు ఇప్పుడు నిరసనల బాట పట్టేశారు. తొలుత పంజాబ్కు చెందిన రైతులే ఈ ఆందోళనలకు శ్రీకారం చుట్టినా… ఇప్పుడు వారికి ఉత్తరప్రదేశ్ రైతులు కూడా తోడయ్యారు. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రైతాంగం కూడా వారితో పాటు కదం తొక్కనుంది.
కదం తొక్కుతున్న అన్నదాతలు
అన్నదాతలు నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి తరలి వస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేందుకు కేంద్రం యత్నించింది. కేంద్రం ఎంతగా అణచివేసేందుకు యత్నిస్తుంటే… అంతకంటే రెట్టింపు సంకల్పంతో అన్నదాతలు కదం తొక్కుతున్నారు. బుధవారం సాయంత్రానికే ఢిల్లీని అన్నదాతలు అష్టదిగ్బంధనం చేసేశారు. ఫలితంగా ఢిల్లీకి అన్ని వైపులా దారులు మూసుకుపోగా… ఢిల్లీకి దారి తీసే అన్ని దారులూ భారీ ట్రాఫిక్ జామ్లతో కనిపిస్తున్నాయి. తొలుత అన్నదాతల ఆందోళనలను కాస్తంత లైట్ తీసుకున్న మోడీ సర్కారు….. ఆ తర్వాత పరిస్థితి చేయి దాటిపోతున్నట్లుగా గ్రహించింది. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలతో చర్చలకు సిద్ధపడింది. అయితే తొలి దఫా జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగియగా… అన్నదాతలు మరింత రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కారు. దీంతో మరోమారు రైతు సంఘాల నేతలతో చర్చలకు మోడీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. గురువారమే ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో సర్కారు అనుసరించే వ్యూహం ఎలా ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పునరాలోచన చేయాల్సిందే..
సాగు రంగంలో మోడీ సర్కారు తీసుకురాదలచిన సంస్కరణలపై అన్నదాతలు వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదనే చెప్పాలి. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే.. తమకు మేలు కలుగుతుందని మోడీ సర్కారు చేస్తున్న మాట అటుంచితే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే కూడా తమ స్థితిగతులు మరింత దిగజారిపోతాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఈ సంస్కరణల అమలు విషయంలో మోడీ సర్కారు పునరాలోచన చేయాల్సిందేనని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా తాను తీసుకున్న నిర్ణయాలపై వెనకడుగు అన్న మాటే లేకుండా సాగుతున్న మోడీ సర్కారు… సాగు సంస్కరణలపై అదే వైఖరితో ముందుకు సాగుతుందా? లేదంటే… అన్నదాతల ఆగ్రహాన్ని చూసి వెనకడుగు వెనకడుగు వేస్తుందా? అన్నది చూడాలి. మొత్తంగా తనదైన శైలి స్పీడుతో సాగుతున్న మోడీ సర్కారుకు రైతుల ఆందోళనలు విషమ పరీక్ష పెట్టాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- వ్యవసాయ చట్టాలు అంత ప్రమాదకరమా?