పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని 32 రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంతో చర్చలు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. కేంద్రం పెడుతోన్న షరతులు అంగీకరించేందుకు రైతులు సిద్దంగా లేరని రైతు పోరాట సంఘం తేల్చి చెప్పింది.
గజగజ వణికే చలిలో వేలాది రైతుల పోరాటం
ఢిల్లీలో చలి విణికిస్తోంది. ఏడు రోజుల కిందట పంజాబ్ నుంచి ట్రాక్టర్లలో బయలు దేరిన వేలాది రైతులు వణికించే చలిలో ఢిల్లీ చేరుకున్నారు. రోడ్డు పక్కనే కటిక నేలపై నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చలి వణికిస్తున్నా ఒక్క రైతూ వెనక్కు తగ్గలేదు. వెంట తెచ్చుకున్న కొద్దిపాటి ఆహార పదార్దాలను తింటూ, కేంద్రం దిగిరావాలని నినాదాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో, రైతు సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యారు. కేంద్రం పెడుతోన్న షరతులకు రైతు సంఘాలు, రైతులు అంగీకరించడం లేదు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తేనే రైతులు ఢిల్లీ వీడి వెళతామని స్పష్టంగా చెబుతున్నారు.
వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళుతోందా?
నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన చట్టాల వల్ల రైతులతో కంపెనీలు ఐదేళ్లు ధరల ఒప్పందం చేసుకునేందుకు వీలు చిక్కుతుంది. దీని వల్ల రైతులు కంపెనీల వలలో పడి ధరల ఒప్పందం చేసుకుంటే, తరవాత ధరలు పెరిగినా ఒప్పందం కుదుర్చుకున్న ధరకే కంపెనీలకు పంటలను అమ్మాల్సి వస్తుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు వారికి లాభాలు వచ్చే, ఎగుమతులకు అవకావం ఉండే పంటలు పండించేందుకు మాత్రమే ఒప్పందాలు చేసుకునే ప్రమాదం ఉందని కూడా వారు భావిస్తున్నారు. దీని వల్ల దేశంలో ప్రజలకు కావాల్సిన ఆహారధాన్యాలు కాకుండా కార్పొరేట్ కంపెనీలు ఎగుమతులు చేసుకునేందుకు అవసరమైన పంటలు వేయాలని రైతులతో ఒప్పందాలు చేసుకుంటే, దేశంలో నిత్యావసరాల ధర విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చట్టాలు రద్దు చేసే వరకూ ఢిల్లీని వీడేది లేదు..
కేంద్రం తీసుకు వచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఢిల్లీని వీడేది లేదని ఇప్పటికే రైతులు, రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. అయినా కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయరంగాన్ని కాలరాసే ఇలాంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో రైతులను దోచుకున్నారని, ఆర్థిక సంస్కరణల వల్ల కార్పొరేట్ శక్తులు లాభాలు పెంచుకున్నాయి, కానీ దేశంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగలేదని రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన చట్టాలు అమల్లోకి వస్తే 60 కోట్ల మంది ఆధారపడిన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం హడావుడిగా కరోనా సమయంలో నూతన వ్యవసాయ చట్టాలు తీసుకురావడంపై అనేక అనుమానలు వస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Must Read ;- మోడీ చెప్పినా విననందుకే పోలవరం తాజా ఎపిసోడ్?