ఏపీ పోలీసు శాఖకు జాతీయ స్థాయి అవార్డుల పంట పండుతోంది. గడచిన రెండేళ్లలోనే ఏపీ పోలీసులకు 130కి పైగా అవార్డులు వచ్చాయి. మంచి పరిణామమే. సత్తా చాటిన వారికి అవార్డులు దక్కాల్సిందే. ఆ అవార్డీల సేవలు అందుకుంటున్న జనం కూడా హర్షం వ్యక్తం చేయాల్సిందే. ఇన్నేసి అవార్డులు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే వచ్చాయంటే.. ఏపీ పోలీసులు బాగానే పనిచేస్తున్నట్లే కదా. మరి పోలీసులు బాగా పనిచేస్తే.. అంటే నేరస్తులకు ముకుతాడు వేస్తే.. నేరాలకు అడ్డుకట్ట వేస్తే.. నేరాల సంఖ్య తగ్గితే.. గత నెల 15వ తేదీన గుంటూరు నగరం నడిబొడ్డులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరిగి ఉండేదే కాదు కదా. ఏదో చీకటిలోనే, నిర్మానుష్య ప్రాంతంలోనే ఈ ఘటన జరగలేదు కదా. పట్ట పగలు.. నడిరోడ్డుపై.. జనం అంతా చూస్తుండగానే.. ఓ ఉన్మాది రమ్యను కత్తితో పొడిచి చంపలేడు కదా. ఈ తరహా ఘటనలు ఏపీలో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మరి ఇలా ఏపీలో నేరాలు యథేచ్ఛగానే సాగుతుంటే.. పోలీసులు నేరాలు ఎక్కడ అరికట్టునట్టు? అవార్డుల మీద అవార్డులు ఎలా వస్తున్నట్టు? దీనికి ఏపీ పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ గౌతం సవాంగే సమాధానం చెప్పాలి.
ఇప్పుడు 5 వచ్చాయట
ఏపీ పోలీసులకు మరోసారి జాతీయస్థాయిలో 5 అవార్డులు లభించాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఘనంగా వెల్లడించారు. దాంతో ఏపీ పోలీసులకు ఈ రెండేళ్ల కాలంలో లభించిన అవార్డుల సంఖ్య 130కి దాటిందని ఆయన జబ్బలు చరుచుకున్నారు. తాజాగా లభించిన ఐదు అవార్డులు టెక్నాలజీ వినియోగం అంశంలో వచ్చాయని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. కృత్రిమ మేధ, పాస్ పోర్ట్ వెరిఫికేషన్, పోలీసు సిబ్బంది డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ తదితర అంశాల్లో ఏపీ పోలీసు విధానాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర పోలీసుల పనితీరు సర్వత్రా ప్రశంసలు అందుకుందని అన్నారు. తాజా పురస్కారాలతో రాష్ట్ర పోలీసులపై మరింత బాధ్యత పెరిగిందని డీజీపీ తెలిపారు. దిశ యాప్ ను అమల్లోకి తీసుకురాగా.. దానిని ఇప్పటికే 46 వేలకు పైగా మహిళలు డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు మరింత ధైర్యంగా తిరగగలుగుతున్నారని కూడా డీజీపీ చెప్పుకొచ్చారు.
వాస్తవ పరిస్థితేంటి?
ఏపీలో మహిళలపై నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 500 మందికి పైగా మహిళలు.. వారిలో మెజారిటీ శాతం దళిత, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఘటనల్లో నిందితులకు శిక్షలు పడిన కేసులు లేనే లేవని కూడా ఆ పార్టీ చెబుతోంది. మొన్నటి రమ్య హత్య ఘటనకు సంబంధించి నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నామని చెబుతున్న పోలీసులు.. ఘటన జరిగి 20 రోజులు అవుతున్నా కూడా అతడికి ఎలాంటి శిక్ష వేయించలేకపోయారని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లోగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని చెబుతున్న జగన్ సర్కారు.. ఇప్పటిదాకా ఎంతమందికి శిక్షలు వేయించిందో చెప్పాలని కూడా ప్రశ్నిస్తోంది. వెరసి జగన్ సర్కారుపై వెల్లువెత్తుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే డీజీపీనే వివరాలు వెల్లడించాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఏపీ పోలీసులూ.. ఈ మాట వినపడిందా?