AP Shakes With Nara Lokesh First Arrest :
నారా లోకేశ్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా పార్టీ తరఫున జగన్ సర్కారు తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలను తిప్పికొట్టే శాసనమండలి సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే.. పార్టీలో కార్యకర్తల సంక్షేమ సమన్వయకర్తగా పనిచేసి తనదైన గుర్తింపు సంసాదించుకున్న నేత. పదిహేనేళ్లకు పైబడిన కెరీర్ లో లోకేశ్ అరెస్టైన సందర్భమే లేదు. అయితే ఏపీలోని జగన్ సర్కారు.. సోమవారం నాడు లోకేశ్ ను అకారణంగా అరెస్ట్ చేసింది. పోలీస్ వ్యాన్ ఎక్కించింది. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టింది. అసలు అరెస్టయ్యే తప్పే లోకేశ్ చేయనప్పుడు ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారన్న వాదనలు సామాన్య జనం నుంచి వినిపిస్తుంటే.. టీడీపీ శ్రేణులు మాత్రం పోలీసుల తీరుతో పాటు జగన్ సర్కారు దుందుడుకు వైఖరిపై తమదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెరసి లోకేశ్ తొలి అరెస్ట్ నవ్యాంధ్రను షేక్ చేసిందనే చెప్పాలి.
అరెస్ట్ కు కారణాలున్నాయా?
గుంటూరులో ఆదివారం నాడు బీ టెక్ విద్యార్థిని రమ్యను శివకృష్ణ అనే ప్రేమోన్మాది అతి కిరాతకంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగింది. అయితే ఈ వీడియో ఫుటేజీ విడుదలలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారు. నిందితుడిని పట్టేసుకున్న తర్వాత సోమవారం ఉదయం ఫుటేజీని విడుడల చేశారు. ఈ ఫుటేజీ చూసిన వారంతా.. రమ్యపై జరిగిన దాడి, ఆ దాడిలో ఆమె తనను తాను రక్షించుకునేందుకు చేసిన పోరాటం, అయినా నిందితుడి దుర్మార్గంపై దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక బాధ్యత కలిగిన విపక్షంగా టీడీపీ తనదైన శైలిలో ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర హోం మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణాలు జరిగితే.. ఇక రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉంది అంటూ నిరసనలకు దిగింది. ఈ క్రమంలో పార్టీ నేతలతో కలిసి లోకేశ్.. రమ్య మృతదేహానికి నివాళి అర్పించడంతో పాటుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు. అయితే ఎక్కడికక్కడ లోకేశ్, టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు ఒకానొక దశలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లోకేశ్.. పోలీసుల తీరును తూర్పారబట్టారు. అసలు తాము చేసిన తప్పేంటని, విపక్ష నేతలుగా బాధితురాలి కుటుంబాన్ని కూడా పరామర్శించే హక్కు కూడా తమకు లేదా అంటూ నిలదీశారు. ఈ సందర్భంగానూ పోలీసుల వైఖరి మారకపోవడంతో లోకేశ్ వారితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అప్పటికే ఈ విషయంపై సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. పరిస్థితులు చేజారిపోతాయన్న కారణం చూపి లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అంటే.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడమే లోకేశ్ చేసిన తప్పన్న మాట.
భగ్గుమన్న జనరల్ పబ్లిక్
నారా లోకేశ్ అరెస్టయ్యారన్న సమాచారం అందగానే.. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలకు దిగాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు పోలీసుల తీరును ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడంతో పాటుగా ప్రత్యక్షంగా రోడ్లపైకి వచ్చి మరీ నిరసనల్లో పాలుపంచుకున్నారు. అసలు లోకేశ్ ఏం తప్పు చేశారని ఆయనను అరెస్ట్ చేస్తారంటూ పోలీసులు, జగన్ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసనల్లో సామాన్య జనం కూడా పాలుపంచుకున్నారు. సోమవారం ఉదయం నుంచి గుంటూరులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రమ్యపై జరిగిన దాడి దృశ్యాలు, ప్రభుత్వ స్పందన, స్వయంగా హోం మంత్రి మేకతోటి సుచరిత పరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్నట్లుగా కనిపించిన వైనంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ప్రజలు టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వెరసి లోకేశ్ అరెస్ట్ ఏపీని షేక్ చేసిందనే చెప్పాలి.
Must Read ;- నారా లోకేశ్ అరెస్ట్.. టీడీపీ నేతలపై ఖాకీ చేయి