ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో రూ.2 లక్షల 75 వేల కోట్లు అప్పులు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రూ.1 లక్ష35 వేల కోట్లు అప్పు చేయగా.. జగన్ ప్రభుత్వం దానికి రెండు రెట్ల అప్పు కేవలం రెండేళ్లలోనే చేసేసింది. అదీగాక రకరకాల పన్నులు వేసి ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది. ఈ అప్పులకు కారణం గత చంద్రబాబు పాలన అని, కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని, సంక్షేమ పథకాల అమలు అని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. గత ప్రభుత్వ అప్పులు, రాబడి, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపులు పరిశీలిస్తే.. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్, రూ.32 వేల కోట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వ బకాయిలు, 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు.. వెరసి మొత్తం రూ.1 లక్ష 30 వేల కోట్లు భారం పడింది. కాగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చేందుకు ఎలాంటి పారిశ్రామిక వాడలు లేవు. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2014 లో రాష్ట్ర ప్రారంభ బడ్జెట్ రూ.1.02 లక్షల కోట్లు కాగా.. గత కాంగ్రెస్ ప్రభుత్వ బకాయిలు రూ.32 వేల కోట్ల ఆనవాయితీ గా వచ్చింది. 2019 లో జగన్ బడ్జెట్ రూ.2.27 లక్షల కోట్లు కాగా.. గత టీడీపీ ప్రభుత్వ బకాయిలు రూ.338 కోట్లు. ఈ లెక్కన జగన్ ప్రభుత్వానికి వచ్చిన బకాయిలు తక్కువే. 2018- 19 టీడీపీ ప్రభుత్వానికి రాబడి రూ.1,50,415 కోట్లు కాగా.. 2020- 21లో జగన్ ప్రభుత్వ రాబడి రూ.1,78,186 కోట్లు.
సంక్షేమానికీ తక్కువే..
జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఒక రైతుకు ఇప్పటిదాకా వచ్చినది రూ.37 వేలు మాత్రమే.. టీడీపీ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ తదితర పథకాలతో రూ.1 లక్ష కు పైగా వచ్చింది. ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని చంద్రబాబు 16 లక్షల మందికి ఇవ్వగా, జగన్ దానిని 11 లక్షల మందికి ఇచ్చారు. చంద్రన్న బీమాను టీడీపీ హయాంలో 2.47 కోట్ల మందికి వర్తింప చేయగా, జగన్ సర్కారు ఆ సంఖ్యను 67 లక్షలకు కుదించింది. చేనేతలకు గత టీడీపీ ప్రభుత్వం ఏటా 50 వేలు ఇవ్వగా, జగన్ ప్రభుత్వం 24 వేలకు తగ్గించింది. ఇలా ప్రతి పథకంలోనూ లబ్ధిదారుల సంఖ్యను తగిస్తూ.. రైతు రుణమాఫీ, విదేశీ విద్య , నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు.. చంద్రబాబు ప్రారంభించిన దాదాపుగా 30 పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.9,450 కోట్లు ఖర్చు చేస్తే… టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై 5 ఏళ్లలో రూ.64 వేల కోట్లు ఖర్చు చేసి.. 23 ప్రాజెక్టులు పూర్తి చేసింది. జగన్ ప్రభుత్వం 800 కిమి రోడ్లు వేయగా, టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 27 వేల కిమీ రోడ్లు వేశారు.
అవినీతి.. ఆదాయానికి గండి..
104, 108 అంబులెన్సులకు ప్రభుత్వ ఖర్చు లేకుండా సమకూర్చే విధానాన్ని రద్దు చేసిన జగన్ సర్కారు.. ప్రభుత్వ నిధులతో అంబులెన్స్ లు కొనుగోలు చేసి రూ.807 కోట్లు కమిషన్ దండుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టులలో కేసుల విచారణ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం. చంద్రబాబు పాలనలో క్వార్టర్ మద్యం సీసా ధర రూ.50 ఉంట.. జగన్ పాలనలో అది రూ.150కి పెరిగింది. ఈ పెరిగిన మొత్తంలో జగన్ ఖాతాలోకి రూ.5 వేల కోట్లు, ఆల్కహాల్ కంపెనీల లాభాల్లోకి రూ. 6 వేల కోట్లు చేరుతోందని అంచనా. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి రూ.8 వేల కోట్లు ప్రజా ధనాన్ని వృధా చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అమరావతికి మాస్టర్ ప్లాన్ ద్వారా అన్ని అవసరాలకు పోగా 10 వేల ఎకరాలు మిగిలి రూ.2 వేల కోట్ల ఆస్తి సమకూరింది. జగన్ పాలనలో మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వచ్చే 2 వేల అగ్రిమెంట్లు చేసుకొన్న 189 కంపెనీలు వెనక్కి వెళ్ళాయి. కరోనాకు కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టడమే కానీ ఒక్క పైసా కుడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని వాదనలు లేకపోలేదు. ఆఖరికి వ్యాక్సిన్ పై కూడా ఖర్చు చేయలేదని సమాచారం. ఇలా అన్నీపరిశీలిస్తే జగన్ అధికారం చేపట్టేనాటికి ఆనవాయితీగా వచ్చిన అప్పు తక్కువే, రాష్ట్రానికి ఆదాయం పెంచి జగన్ చేతికి ఇచ్చారు. టీడీపీ సంక్షేమం, అభివృద్ధికి కేటాయించిన నిధుల కన్నా జగన్ అభివృద్ధి, సంక్షేమంపై కేటాయించిందీ తక్కువే. ఇన్ని వెసులుబాటు ఉన్నా.. అప్పులకు కారణం చంద్రబాబు అని, కరోనా అని, సంక్షేమం పథకాలకు ఖర్చు అని అబద్ధాలు చెబుతున్నారు.
Must Read ;- ఈ ఘనత ఏపీకి మాత్రమే సొంతం!











