దేశ ప్రజలకు గుడ్ న్యూస్. కరోనా రోగులకు ఉపయోగించే మందులతో పాటు పలు వైద్య పరికరాలపై పన్నులు తగ్గిస్తూ 44వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఆక్సిజన్, బైపాస్ మెషీన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లుతో పాటు, కోవిడ్ టెస్టింగ్ కిట్స్పై కూడా భారీగా పన్నులు తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పన్నులు తగ్గిస్తూ తాజాగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. బ్లాక్ ఫంగస్కు వాడుతున్న మందులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తి వేశారు. కోవిడ్ 19 సంబంధిత వైద్య పరికరాలపై కూడా పన్నులు తొలగించారు.
కొన్నింటిపై పూర్తిగా..మరి కొన్నింటిపై తగ్గింపు
కీలక మందులపై సెప్టెంబరు వరకు పూర్తిగా జీఎస్టీ తొలగించారు. బ్లాక్ ఫంగస్ నివారణకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బీ, టోసిలిజుమాబ్ మందులపై పూర్తిగా జీఎస్టీ రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. కరోనా నివారణలో ఉపయోగించే అన్ని రకాల వస్తువులపై ఇప్పటి వరకు ఉన్న 18 శాతం పన్ను రేటును కొన్నింటిపై 12, మరికొన్నింటిపై 5 శాతం మాత్రమే వసూలు చేయనున్నారు. ఇక అంబులెన్సు సేవలపై 28 శాతం ఉన్న జీఎస్టీని సగానికిపైగా అంటే 12 శాతానికి కుదించారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో కోవిడ్ రోగులకు కొంత వెసులుబాటు కలగనుంది. కరోనా పరికరాలు, మందుల ధరలు తగ్గడం వల్ల కరోనా రోగుల వైద్యానికి అయ్యే ఖర్చు కూడా 5 నుంచి 12 శాతం దాకా తగ్గే అవకాశం ఉంది.
Must Read ;- వృథా చేస్తే కోతే.. టీకాల పంపిణీకి కేంద్రం కొత్త మార్గదర్శకాలు