Haryana Ex Chief Minister Om Prakash Chautala Attends Tenth Class Exams :
ఓం ప్రకాశ్ చౌతాలా.. దేశ మాజీ ఉప ప్రధానిగా వ్యవహరించిన చౌదరీ దేవీలాల్ కుమారుడు. ఇంతటి ఘన చరిత్రను కూడా చెరిపేసిన చౌతాలా.. హర్యానాకు ఏకంగా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. తొలి మూడు దఫాల్లో కాస్త తడబడ్డా.. నాలుగో సారి మాత్రం పూర్తి టెర్మ్ సీఎంగా వ్యవహరించారు. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి కూడా పదేళ్ల క్రితం దాకా ఆయనే అధ్యక్షుడు. కేంద్రంలో సంకీర్ణ శకం మొదలైన తర్వాత ఏ కూటమి అధికారం చేపట్టాలన్నా.. ఐఎన్ఎల్డీ అందులో కీలక భూమిక పోషిస్తూ వచ్చింది. అంతేనా.. ఈ పార్టీకి చెందిన ఏ నేతలైనా తమదైన శైలి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఐఎన్ఎల్డీతో పాటు చౌతాలాను ఎప్పటికప్పుడు ధీరోదాత్తులుగా నిలుపుతున్నారు.
ఇప్పుడు చౌతాలా ప్రస్తావన ఎందుకు?
అయినా సీఎం కుర్చీలో ఉండి కూడా టీచర్ల నియామకాల్లో లంచాలు తీసుకుని.. ఈ కేసులో ఏకంగా దోషిగా తేలి పదేళ్ల జైలు శిక్షకు గురైన చౌతాలా గురించి ఇప్పుడెందుకు అంటారా? ఎందుకేమిటి.. ఈయన గారి విద్యాభ్యాసం గురించి ఇప్పుడు మరోమారు చర్చ జరుగుతోంది. దేశంలో అక్షరాస్యత అధికంగా కలిగిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న హర్యానాకు టెన్త్ కూడా పాస్ కాని చౌతాలా ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారా? అంటూ ఇప్పుడు జనం నోరెళ్లబెడుతున్నారు. అంతేనా.. చదువు లేని కారణంగానే చౌతాలా అవినీతి వ్యవహారాల్లో పట్టుబడిపోయారని, ఏపీ సీఎం జగన్ మాదిరి కనీసం డిగ్రీ దాకా అయినా చదువుకుని ఉండి ఉంటే.. అసలు పట్టుబడేవారే కాదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా టెన్త్ పరీక్షలకు హాజరై.. ఏదో వెలగబెడుతున్నామన్న యావతో ఎగ్జామ్ హాలుకు వెళ్లిన చౌతాలా.. తనతో పాటు అవినీతి వ్యవహారాల్లో కేసులు ఎదుర్కొంటున్న జగన్ మాదిరి సీఎంలు, ఇతర నేతలను కూడా ఇరికించిపారేశారన్న మాట.
చౌతాలా విద్యార్హతలేమిటి?
సరే.. వివాదాలు ఎలాగూ అలా కొనసాగుతూనే ఉంటాయి.. ఇలా అవినీతికి పాల్పడ్డ నేతలు సీఎంలు, మంత్రులు అయిపోతూనే ఉంటారు గానీ.. ఈ చర్చను రేకెత్తించిన చౌతాలా అసలు విద్యార్హతలు ఏమిటన్న విషయానికి వస్తే.. ఐఎన్ఎల్డీ తరఫున చాలా సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన చౌతాలా కొన్ని సార్లేమో తాను పదో తరగతి కంటే తక్కువే చదివానని చెప్పుకున్నారు. కొన్ని సార్లేమో తాను పదో తరగతి పాస్ అయ్యానని కూడా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. మరి టెన్త్ పాస్ అయినట్లుగా అఫిడవిట్ లో పేర్కొంటే.. ఇప్పుడు పదో తరగతి పరీక్షకు ఆయన ఎందుకు హాజరైనట్లు? అంటే.. చౌతాలా పది కూడా ఇంకా పాస్ కాలేదన్న మాటేగా. అంతేకాకుండా టీచర్ల కుంభకోణంలో పదేళ్ల జైలు శిక్షకు గురైన చౌతాలా.. తీహార్ జైల్లో ఉండగా.. దూర విద్య విధానంలో ఇంటర్ పరీక్షలు రాశారట. వాటిని ఆయన ఏ గ్రేడ్లో కూడా పాసయ్యారట. ఈ విషయాన్ని ఆయన మనవడు, ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా ఉన్న దుష్యంత్ చౌతాలా గొప్పగా చెప్పుకున్నారు. అయితే పదో తరగతి పాస్ కానందున సీనియర్ చౌతాలా ఇంటర్ ఫలితాలను వెల్లడించడం లేదని ఆ తర్వాత నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ప్రకటించింది. మొత్తంగా హర్యానాకు నాలుగు పర్యాయాలు సీఎంగా వ్యవహరించిన చౌతాలా పదో తరగతి కూడా పాస్ కాలేదన్న మాట. పదో తరగతి పాస్ కాకుండానే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ చౌతాలా.. తనకు చదువు లేని కారణంగానే లూప్ హోల్స్ తెలుసుకోలేక చిక్కిపోయారని.. అదే జగన్ మాదిరి డిగ్రీ వరకైనా చదువుకుని ఉంటే.. జగన్ మాదిరే కోర్టు కేసులను మేనేజ్ చేసుకుంటూ ఎంచక్కా ఇంకా సీఎం పదవిలోనే కొనసాగేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అవినీతి వెర్షన్ 1.1 :: మహా తిమింగలం!











