అదేంటో గానీ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పదవి ఊడిపోనుందని, ఆయన మాజీ సీఎంగా మారిపోతారని, అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని వైరి వర్గాలు పదే పదే చెబుతున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల మేర సొమ్మును వెనకేసుకున్నారని.. వైరి వర్గాలతో పాటు నాడు జగన్ కొనసాగిన కాంగ్రెస్ పార్టీ కూడా నినదించింది. కాంగ్రెస్ హయాంలోనే జగన్ పై అక్రమాస్తుల కేసు నమోదు కాగా.. ఈ కేసులో టీడీపీ కూడా ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే జగన్ ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు.
బెయిల్ రద్దైతే జైలేగా
ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ పై ఉన్న జగన్.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి సీఎం కాగలిగారు. సీఎం అయినంత మాత్రాన ఆయనపై నమోదైన కేసులేమీ రద్దు కావు కదా. అందులోనూ జగన్ పార్టీ టికెట్ పై ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఏకంగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూనేరుగా సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఇప్పటికే విచారణ పూర్తి అయినట్లుగా ప్రకటించిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. తన నిర్ణయాన్ని ఈ నెల 25 ప్రకటిస్తానని వెల్లడించింది. అంటే.. ఈ నెల 25న సీబీఐ కోర్టు జగన్ బెయిల్ ను రద్దు చేస్తే.. జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు. సీఎం పదవి నుంచి దిగిపోకా తప్పదు. అంటే జగన్ మాజీ సీఎం అయినట్టే కదా. ఇదే ఈక్వేషన్ ను పదే పదే ప్రస్తావిస్తున్న రఘురామ, టీడీపీ నేతలు జగన్ మాజీ సీఎం అయిపోవడం ఖాయమేనని చెబుతన్నారు.
చింతా ఏమంటారంటే..?
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుపతిలో మీడియా ముందుకు వచ్చిన చింతా మోహన్ ‘‘బెయిల్ రద్దు కేసు నుంచి బయటపడేందుకు జగన్ ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉంది. అయితే, మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ మాజీ కావడం తథ్యం. జగన్ రాజకీయ పతనం ప్రారంభమైనట్టే. రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోంది’’ అని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీై కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై జరిగిన విచారణను పరిశీలించిన మీదటే.. చింతా మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ముందు నుయ్యి.. వెనుక గొయ్యి