High Tension Breaks Out In YCP Over TDP Janasena Protests On Roads :
ఏపీలో జగన్ కేబినెట్ లోని పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు.. చివరికి ఆ పార్టీకి చెందిన చోటా మోటా నేతలు కూడా మంగళవారం ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చేశారు. వచ్చీ రావడంతోనే రాష్ట్రంలోని రోడ్ల దుస్థితికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హయాంలోని పాలనే కారణమంటూ తమదైన శైలిలో సంచలన ఆరోపణలు చేశారు. ఇక సీఎం జగన్ కూడా సోమవారమే.. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఏకంగా పలువురు మంత్రులు, అధికారులతో భారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.6,400 కోట్లతో రాష్ట్రంలోని రోడ్లను మరమ్మతులు చేయాలంటూ ఆ సమీక్షలో తీర్మానించారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించేందుకు వచ్చిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శంకర నారాయణలు కూడా చంద్రబాబు పాలన కారణంగానే రోడ్లకు ఈ దుస్థితి పట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ తరహాలో వైసీపీ నుంచి ఓ రేంజీలో దాడి జరుగుతోంది. దీని వెనుక వైసీపీలో రేగిన కొత్త అలజడే కారణమంటూ విశ్లేషణలు సాగుతున్నాయి.
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు జనసేన
రాష్ట్రంలోని రోడ్లకు రెండున్నరేళ్లుగా మరమ్మతులు లేని కారణంగా రోడ్లన్నీ గుంతలను తలపిస్తున్నాయి. ఈ దుస్థితిపై మొన్నామధ్య విపక్ష టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనల్లో కొందరు టీడీపీ నేతలు రోడ్లపై వరి నాట్లు వేస్తే.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏకంగా రోడ్డుపై ఏర్పడ్డ ఓ గుంతలో చేపలు పట్టి వినూత్న నిరసనకు దిగారు. వెరసి రాష్ట్రంలో రోడ్లను జగన్ సర్కారు పట్టించుకోవడం లేదంటూ జనానికి అర్థమయ్యేలా టీడీపీ చేసింది. టీడీపీ నిరసనలను నాడు వైసీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా ఇప్పుడు రోడ్ల దుస్థితిపై తనదైన శైలి నిరసనలను మొదలెట్టేసింది. టీడీపీ నిరసనల స్థాయిలో జనసేన నిరసనలు లేకున్నా.. సోషల్ మీడియా వేదికగా రోడ్ల దుస్థితిని తెలిపేలా జన సైనికులు లెక్కలేనన్ని పోస్టులు పెడుతున్నారు. ఈ నిరసనలు కూడా నాలుగైదు రోజులుగా కొనసాగుతున్నాయి. అయితే అప్పుడు టీడీపీ, ఇప్పుడు జనసేన ఒకే అంశం మీద నిరసనలు చేపట్టడంతో వైసీపీలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో సీఎం జగన్ సమీక్షలు పెడితే.. పార్టీ కీలక నేతలంతా మీడియా ముందుకు వచ్చి టీడీపీ పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆ రెండూ కలిస్తే కొంప కొల్లేరే!
2014 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, తాను సీఎం అయిపోతానని జగన్ గట్టిగా నమ్మారు. వైసీపీ నేతలు కూడా ధీమాగానే కనిపించారు. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ, జనసేనలతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. దీంతో గెలిచే అవకాశాలున్నాయనుకున్న వైసీపీ ఓటమిపాలు కాగా.. టీడీపీ విక్టరీ కొట్టేసింది. ఆ తర్వాత 2019 ఎన్నికల విషయానికి వస్తే.. టీడీపీకి దూరం జరిగిన జనసేన, బీజేపీలు వేటికవే వేర్వేరుగా పోటీ చేశాయి. వెరసి 2014లో ఉమ్మడిగా తమకు దక్కిన ఓట్లను ఈ మూడు పార్టీలు చీల్చుకున్నాయి. ఫలితంగా వైసీపీ రికార్డు విక్టరీ కొట్టింది. ఇప్పుడు రోడ్లపై ముందుగా టీడీపీ, తర్వాత జనసేన నిరసనలకు దిగడంతో ఈ రెండు పార్టీలు మళ్లీ జతకడతాయేమోనని వైసీపీ అనుమానిస్తోంది. ఈ అనుమానం మరింతగా బలపడిన నేపథ్యంలో టీడీపీతో పాటు జనసేనపైనా వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తూ వరుసగా మీడియా ముందుకు వస్తున్నారు. అంటే.. 2014 ఫలితాలు మరోమారు రిపీట్ అయితే తమ కొంప కొల్లేరేనన్న భయం వైసీపీని, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ను వెంటాడటం మొదలెట్టింది. ఫలితంగానే వరుసగా వైసీపీ నేతలు ఎదరు దాడికి దిగినట్లుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- వైసీపీ పనిని టీడీపీ భుజానేసుకుంది