Elamanchili YCP MLA Kannababu Raju Involved In Another Land Dispute In Visakhapatnam :
అదేంటో తెలియదు గానీ.. సాగర నగరం విశాఖ అంటేనే భూముల దందాకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఇప్పుడంటే.. విశాఖను ఏపీ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా మార్చేస్తామని జగన్ సర్కారు ఊదరగొడుతోంది గానీ.. గతంలోనూ విశాఖలో లెక్కలేనన్ని భూ దందాలు జరిగినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ప్రకృతి అందాలతో అలరారే నగరం కాబట్టే.. అక్కడి భూములకు విపరీతమైన గిరాకీ అని, అందుకే ఆ నగరంలో చిన్న జాగా దొరికితే చాలు అంటూ పరుగులు పెట్టే ధనవంతులు చాలా మందే ఉన్నారని చెబుతారు. ఎక్కడ డిమాండ్ ఉంటుందో.. అక్కడ అక్రమార్కులు కూడా పోగవుతారు కదా. అలాగే విశాకలోనూ అక్రమార్కులు పోగుబడి లెక్కలేనన్ని దందాలు సాగించారు. ఈ దందాల్లో ఒక్కో దందాది ఒక్కో తీరు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజునే ఈ అక్రమార్కులు బురిడీ కొట్టించేశారు కాబట్టి. అయినా ఇప్పటికే లెక్కలేనన్ని ఆరోపణలను నెత్తినేసుకుని కూర్చున్న కన్నబాబు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి కదా. అలాంటిదేమీ లేకుండానే రూ.100 కోట్ల విలువ చేసే భూమి కేవలం రూ.19 కోట్లకే వస్తోందంటే.. అనుమానించాల్సింది పోయి అక్రమార్కులతో ఏకంగా జీపీఏ చేసుకుని అడ్డంగా బుక్కయ్యారు.
అసలు ఏం జరిగిందంటే..?
విశాఖపట్నంలో ప్రైమ్ ఏరియాలో ఉన్న ఓ భూమి విలువ దాదాపుగా రూ.100 కోట్లకు పైగానే ఉందట. ఈ భూమి యజమాని ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఇదే అదనుగా దళారులు కొందరు ఈ భూమిని విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. రూ.100 కోట్ల విలువైన భూమిని అతి తక్కువ ధరకే ఇస్తామంటూ పలువురు ప్రముఖులతో బేరసారాలు మొదలెట్టారు. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు రూ.100 కోట్ల విలువైన భూమిని రూ.19 కోట్లకే ఇస్తున్నారంటే.. ఇందులో ఏదో తిరకాసు ఉందని అనుమానించి వద్దు పొమ్మన్నారట. అయితే ఎంత వెనకేసుకున్నా.. ఇంకా కావాలనే యావ కలిగిన నేతగా పేరు పడిన కన్నబాబు రాజును దళారులు ఆశ్రయించారు. రూ.100 కోట్ల భూమి రూ.19కోట్లకే ఇస్తారా? అయితే రండి మరి జీపీఏ చేసుకుందాం.. అంటూ కన్నబాబు రాజు వారితో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట.
భూ యజమాని ఫిర్యాదు
అయితే ఎక్కడున్నా.. తమ ఆస్తిపాస్తులకు సంబంధించి ఎవరైనా ఓ కన్నేసే ఉంటారు కదా. మరి విశాఖ లాంటి నగరంలో ఏకంగా రూ.100 కోట్ల విలువైన భూమి అంటే.. దాని యజమాని దానిని అలా ఎలా వదిలేస్తారు. ఈ క్రమంలోనే భూ యజమాని భార్యకు ఈ జీపీఏ విషయం తెలిసిందట. అప్పటికే విశాఖలో లెక్కలేనన్ని దందాల అనుభవంతో ఆమె వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కన్నబాబు రాజు ఆ భూమికి అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుసుకుని.. ఆ దిశగా నరుక్కుంటూ వచ్చి.. తమది కాని భూమికి జీపీఏ చేసుకున్న దళారులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న కన్నబాబు రాజు.. ఇప్పుడు ఈ వివాదం నుంచి తనను తాను ఎలా రక్షించుకుంటారోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- కుంతల దేశం విశాఖ.. దానికి రాజు సాయిరెడ్డి