అనుకున్నంతా అవుతోంది. నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోలు సైతం ఓటీటీ దారిలోకి వచ్చారు. బాలీవుడ్ సినిమాలు ఎక్కువ శాతం మల్టీఫ్లెక్స్ , ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం తీస్తుంటారు. అందువల్ల ఆ కంటెంట్ ఓటీటీ వేదికలకు ఓకే… కానీ సౌత్ ఇండియన్ సినిమాల కథ వేరు. మాస్ ప్రేక్షకుల కోసమే సినిమాలు రాస్తుంటారు, తీస్తుంటారు. థియేటర్స్, అభిమాన సంఘాలు ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే ఎక్కువ. హీరోలను దేవుళ్ళా కొలవడం కూడా సౌత్ ఇండియాలోనే ఉంటుంది. బెనిఫిట్ షోస్, బ్లాక్ టికెట్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్, ఫాన్స్ హడావుడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలకు ఉన్నట్లు హిందీ సినిమాలకు ఉండదు.
ఓవర్ నైట్ స్టార్ డమ్స్, వంశపారంపర్యంగా వచ్చే అభిమానులు.. ఈ భాషా చిత్రాల వారికే ఉంటుంది. అంతేకాదుపెద్దగా యాక్టింగ్ రాకపోయినా కోట్లు డిమాండ్ చేసే హీరోలుగా సునాయాసంగా అయిపోవచ్చు. కామన్ సెన్స్ లేకపోయినా, బి. సి. సెంటర్ల మాస్ ఆడియన్స్ ని నమ్ముకుని, హీరోయిజం బిల్డ్ అప్ చేసి, నెంబర్ వన్ డైరెక్టర్స్ అయిపోవచ్చు. ఇలాంటి వాటికి కరోనా వైరస్ చెక్ పెట్టింది. చిన్నాచితకా సినిమాలను ఇంతవరకు ఓటీటీ మొహాన పడేస్తూ వచ్చారు . థియేటర్స్ తెరిస్తే తమ సినిమాలు రికార్డ్స్ కొల్లగొడతాయని దింపుడు కళ్లెం ఆశల్లో ఉన్నారు.
తమ సినిమాలు హాల్స్ లో చూస్తేనే ప్రేక్షకులకు సౌండ్ డిజైన్, మేకింగ్ క్వాలిటీ తెలుస్తాయని చెప్పుకుంటూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిలో థియేటర్స్ కి అనుమతులు ఇచ్చేలా కనబడటం లేదు. ఇచ్చినా కరోనా భయంతో, చితికిపోయిన ఆర్ధిక పరిస్థితుల్లో సామాన్య కుటుంబాలు థియేటర్ కి రావడం కష్టం.
తాము కోట్లు ఖర్చు పెట్టి తీశాము కాబట్టి ప్రేక్షకులు థియేటర్ కి పరుగెత్తుకుంటూ వస్తారని కొందరు డైరెక్టర్ చెబుతున్నారు. చేదు నిజం ఏంటి అంటే వీళ్లకి కోట్లు విలువ అయినవి అయితే సామాన్యుడికి వాడి వంద రూపాయిలు అంతకన్నా విలువ అయినవి. తెలుగులో నాని, సుధీర్ బాబుల V సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది.
అనుష్క ” నిశ్శబ్దం” కూడా సెప్టెంబర్ రెండో వారంలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. తమిళంలో సూర్య ” సురరై పోట్రు ” అక్టోబరు 30న, ధనుష్ ” జగమే తంత్రం ” నవంబర్ 14న ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలవుతున్నాయి. మళయాళం, కన్నడంలో కూడా థియేటర్స్ ఆశ వదులుకుని ఓటీటీ వైపే చూస్తున్నాయి. ఇది ప్రస్తుత స్థితి. ఓటీటీ ప్లాటుఫామ్ కూడా స్టార్ వేల్యూ ఉన్న సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. లేదంటే గంట నిడివికి వచ్చిన వ్యూయర్ షిప్ బట్టి రెవెన్యూలో షేర్స్ ఇస్తున్నాయి. ఈ దశలో ఓటీటీ విడుదలకు ఎందుకు ఇండస్ట్రీ భయపడుతోంది?
రికార్డ్స్, కలెక్షన్స్ అనే మాట మరచిపోవాల్సిందే.
మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడానికి లేదు. రిపీటెడ్ వ్యూస్ ఉన్నా రిపీటెడ్ కలెక్షన్స్ రావు. బి. సి. సెంటర్స్ ఫాన్స్ తగ్గుతారు. దాంతో ఆటో మాటిక్ గా రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలి. సినిమా బడ్జెట్లు తగ్గిపోతాయి. అన్నిటికిమించి తన సినిమా ఆ డిజిటల్ వేదిక మీద ఇంటర్నేషనల్ సినిమాలతో పోటీపడాలి. పైగా అర్బన్ ఏరియా ప్రేక్షకులు లేదా మిడిల్ క్లాస్ ప్రేక్షకులు వాళ్ళ న్యాయనిర్ణేతలు. కంటెంట్ లో, నటనలో రోజుకి పది సినిమాలతో పోటీ పడాలి. మాస్ గిమ్మిక్స్ పనికి రావు . ఇదే స్టార్ హీరోలను, డైరెక్టర్లను వణికిస్తోంది. ఇది శాశ్వతం కాదు కానీ ఇంటిలో సినిమాలకు అలవాటు పడ్డ ప్రజలని తిరిగి థియేటర్ కి పిలిపించాలంటే సినిమా రంగం తనని తానూ మార్చుకోవాలి. తమను కప్పేసిన ఫాల్స్ ప్రెస్టీజ్ నుంచి పూర్తి గా బయట పడాలి. లేకపోతే కొత్త తరం వస్తుంది, కొత్త సినిమా వస్తుంది.