తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో దశాబ్ధాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తుల మధ్య వైరం కొనసాగుతోంది. గతంలో వీరు వేరు వేరు పార్టీల్లో ఉండేవారు. తోట త్రిమూర్తులు ఎన్నికలకు ముందు టీడీపీ వీడి వైసీపీలో చేరడంతో ఇద్దరూ ఒక పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తోట త్రిమూర్తులు దళితుడి శిరోముండనం కేసు విచారణకు రాకుండా మేనేజ్ చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడని, రెండు దశాబ్ధాల కిందట జరిగిన ఆ కేసు వ్యవహారం ఏమైందంటూ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హోం మంత్రికి లేఖ రాశారు. దీంతో ఇద్దరు వైసీపీ నేతల మధ్య వివాదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.
తోటపై కక్షేకాని, దళితులపై ప్రేమ కనిపించడం లేదు
వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోం మంత్రికి రాసిన లేఖలో తోట త్రిమూర్తులు ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఓ దళితుడికి శిరోముండనం చేయించిన కేసులో ఏ వన్ గా ఉన్నాడని, ఆ కేసు విచారణకు రాకుండా చక్రంతిప్పుతున్నాడని బోస్ హోం మంత్రికి లేఖ రాశారు. అంటే ఎప్పుడో జరిగిన ఘటనను అడ్డంపెట్టుకుని తోట త్రిమూర్తులను జైలుకు పంపించాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చూస్తున్నారని తెలుస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో కొనసాగుతూ తోట త్రిమూర్తులు దళితుడి శిరోముండనం కేసు వాయిదాలకు రాకుండా చూస్తున్నాడని పిల్లి ఆరోపణల్లో సారాంశం.
అయితే ఎప్పుడో రెండు దశాబ్ధాల కిందట జరిగిన శిరోముండనం కేసు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు గుర్తుంది కానీ 4 నెలల కిందట సీతానగరంలో ఓ దళితుడిని కొందరు వైసీపీ నేతల ఒత్తిడి మేరకు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసిన ఘటన మాత్రం ఆయనకు గుర్తుకు రాకపోవడం శోచనీయం. ఆయన లేఖాస్త్రంలో తోట త్రిమూర్తులు మీద కక్ష కనిపిస్తోందే తప్ప.. దళితులపై ప్రేమ కనిపిస్తోందా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.
Also Read ;- కరణంపై కత్తిదూయడం, ఆమంచి కల తీరడం.. జరగవు!
రాష్ట్రపతి ఆదేశించినా అతీగతీ లేదు
రాజమండ్రి సమీపంలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే దళిత యువకుడు, వైసీపీ నేతల అక్రమ ఇసుకదందాను ప్రశ్నించినందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు పిలిపించి శిరోముండనం చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఆగ్రహానికి గురైంది. ఈ కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా బాధితుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక న్యాయం జరగదని భావించి, నాకు న్యాయం జరిగేలా లేదు, నాకు అనుమతిస్తే నక్సల్స్ లో చేరిపోతానంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
దీంతో వెంటనే స్పందించిన రాష్ట్రపతి కేంద్ర న్యాయశాఖను ఆదేశించారు. వారి ఆదేశాలతో కొద్ది రోజులు హడావుడి చేసిన అధికారులు తరవాత కేసు ఏమైందో కూడా వెల్లడించడం లేదు. దీనిపై ప్రశ్నించని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎప్పుడో జరిగిన శిరోముండనం కేసు వెలికి తీయాలంటూ హోం మంత్రికి లేఖ రాయడం తోట త్రిమూర్తులపై ఉన్న కక్ష తీర్చుకోవాలని చేస్తున్నట్టే ఉంది, కానీ దళితులపై మాత్రం ప్రేమ కనిపించడం లేదు.
Also Read ;- నాకు ప్రాణహాని ఉంది : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు











