తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ప్రకటించనుంది. అధ్యక్ష రేసులో తాజాగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ సారథ్యం అప్పగించబోతున్నట్లుగా కొన్నిరోజులుగా వినిపించిన వార్తలకు చెక్ పడుతున్నట్లే. రేవంత్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా వచ్చిన లీకులపై పార్టీ సీనియర్లు చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు. వీహెచ్ లాంటి వాళ్లు పార్టీ వీడిపోతాం అని హెచ్చరికలు కూడా చేశారు. ఎంత చెడ్డా సరే.. పార్టీ సారథ్యం రేవంత్ కు మాత్రమే ఇస్తారని వార్తలు వచ్చాయి గానీ.. తుది క్షణాల్లో.. సీనియర్ల నిరసనలు పనిచేసినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ ను కాకుండా.. జీవన్ రెడ్డిని ఎంపికచేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ అధ్యక్ష భాద్యతలు ?
అలాగని రేవంత్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టబోవడం లేదు. ఆయన సేవల్ని గట్టిగానే ఉపయోగించుకోబోతున్నారు. ఆయనకు ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా తనకు అలాంటి హోదా మీదనే మక్కువ ఉన్నదనే సంకేతాలు ఇచ్చారు. అయితే.. పీసీసీ సారథ్యం దక్కడం లేదని అర్థమైన తర్వాతనే.. రేవంత్ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. 162 మంది నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. పార్టీని సమర్ధవంతంగా నడిపే వ్యక్తి, సీనియర్, అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తికి అధ్యక్ష భాద్యతలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మనిక్కం ఠాగూర్,కేసి వేణుగోపాల్ లు డిసెంబర్ 27న జీవన్ రెడ్డిని ఢిల్లీ పిలిచి మాట్లాడారు. సీనియర్ నేత గనుక పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని జీవన్ రెడ్డికి ఆరోజే సూచించినట్లు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి పేరును వ్యతిరేకించడం.. రాహుల్, సోనియా గాంధీలకు లేఖలు కూడా రాయటంతో రేవంత్ పేరు పిసిసి రేస్ నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని.. ప్రచార కమిటీ ఛైర్మన్ పనే తనకు ఇష్టమేనని రేవంత్ రెడ్డి అంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే సీనియర్లతో ఇబ్బందులు వస్తాయన్న భావనతోనే జీవన్ రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ను వ్యతిరేకించిన సీనియర్లు.. జీవన్రెడ్డి విషయంలో సానుకూలంగా ఉండటంతో.. ఆయన పేరు ఖరారు కాబోతోంది.
జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే ఆయన చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. జీవన్రెడ్డికి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉంటే, రేవంత్ రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని భావిస్తున్నారు. టిపిసిసిలో మార్పులపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది.
కోమటిరెడ్డి సంగతేంటి?
పీసీసీ చీఫ్ స్థానం కోసం చివరివరకు తీవ్రంగా ప్రయత్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏమిటనేది క్లారిటీ రావడం లేదు. నిన్నటిదాకా కోమటిరెడ్డిని తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ, జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాత.. కోమటిరెడ్డికి ఇలాంటి కీలక పదవి ఇస్తారా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. అలా చేస్తే గనుక.. రెడ్డి వర్గానికే అన్ని కీలకపదువులూ కట్టబెట్టినట్టు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, అందువల్ల పార్టీ అధిష్టానం ఇంకా మీమాంసలో ఉందనే విశ్లేషకులు అంటున్నారు.
కోమటిరెడ్డిపై పార్టీకి అనుమానాలున్నాయా? అనే ప్రచారం కూడా జరుగుతోంది. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. తమ్ముడు బీజేపీలోకి వెళ్లిన తర్వాత.. వెంకటరెడ్డి కూడా పక్కచూపులు చూస్తారా? అనే అనుమానం కూడా పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆశించినట్లుగా పీసీసీ సారథ్యం దక్కకపోతే గనుక.. ఆయన కూడా బీజేపీలోకి వెళ్లిపోవచ్చునని.. అందుకే అధిష్టానం పునరాలోచనలో ఉన్నదని ఒక వాదన వినిపిస్తోంది.
Also Read: తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?











