ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజును వెన్నుపోటు దినంగా జరపాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఐతే జగన్ పిలుపుతో ఎంతమంది నేతలు వెన్నుపోటు దినంలో పాల్గొంటారో, లేదో తెలియదు కానీ కూటమి పార్టీలు మాత్రం జగన్కు కౌంటర్గా మరో కార్యక్రమాన్ని ప్రకటించేశాయి. జూన్ 4 తేదీన జగన్ నుంచి విముక్తికి ఏడాది, పీడ విరగడయి ఏడాది పేరుతో తెలుగుదేశం, జనసేన కార్యక్రమాలు ప్రకటించాయి. సంక్రాంతి, దీపావళి సంబరాల తరహాలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఉదయం పూట ముగ్గుల పోటీలు, సాయంత్రం బాణాసంచా కాల్చాలని శ్రేణులకు రెండు పార్టీలు పిలుపునిచ్చాయి.
ఐదేళ్లపాటు తన తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని పీడించిన జగన్..ఘోరంగా ఓడిపోయి దాదాపు ఏడాది పూర్తికావొస్తుంది. ఆ ఐదేళ్ల పాటు ఏపీలో అభివృద్ధి దేవుడెరుగు కానీ అరాచకాలు, అక్రమాలు, భూకబ్జాలు, ఇసుక దందాలతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఆ పరిస్థితి తలుచుకుంటే ఇంకా జనంలో వణుకుపుడుతోంది. చివరికు ఇందిరాగాంధీ హయాంలో ఇళ్లు పొందిన పేదలను వదలకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో …వాలంటీర్లను, అధికారులను ఇళ్ల మీదకు వదిలారు. కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చి చీప్ లిక్కర్ తాగించి లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడారు.
ఏడాది గడిచినప్పటికీ జగన్ పాలన ఆకృత్యాలను సామాన్యులు మరిచిపోలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు కట్టబెట్టిన ఏపీ ప్రజలే జగన్ పాలనఘనకార్యాన్ని చూసి 2023లో 11 స్థానాలకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఐతే జగన్ మాత్రం ఇప్పటికీ ప్రజా తీర్పును గౌరవించడం లేదు. కూటమి సర్కార్ కుట్రలతో గెలిచిందని ప్రకటనలు చేస్తూ ఆత్మ సంతృప్తి చెందుతున్నారు. ఐదేళ్లలో అంతా మంచే చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.











