‘ఇలాంటి మనిషి రక్తమాంసాలతో ఈ భూమిపైన నడయాడాడంటే.. భవిష్యత్ తరాలు నమ్మవు’ ఇవి.. గాంధీ గురించి ఐన్ స్టీన్ అన్న మాటలు. ఇవి అక్షర సత్యాలని ఈ తరం నిరూపిస్తోంది. అవినీతి కల్మషంలో బతుకుతున్న నేటి యువతరానికి మహాత్ముడి మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆయన తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కొరవడింది. అందుకే మన పాలకులు సైతం.. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ త్యాగమూర్తిని విమర్శించే సాహసం చేస్తున్నారు. ఆయన్ను బలితీసుకున్న గాడ్సేను దేశభక్తుడిగా కీర్తిస్తున్నారు. తన ఉక్కు సంకల్పంతో భరతమాత తలరాతను మార్చిన ఈ విధాత ప్రసాదించిన స్ఫూర్తిని అవమానిస్తున్నారు.
గాంధీ చేసిన తప్పేంటి?
దేశానికి స్వాతంత్ర్యం తేవడమే గాంధీ చేసిన తప్పా? అంటే.. నేతాజీ, భగత్ సింగ్ లాంటి ఎందరో అమరవీరులు ఎప్పుడో స్వాతంత్ర్యం తెచ్చేవారని, గాంధీ వల్లే ఆలస్యం అయిందని మాట్లాడే మూర్ఖులు ప్రస్తుత కాలంలో ఎక్కువయ్యారు. నిజమే.. వారన్నట్లు కాస్త ముందుగానే స్వాతంత్రం వచ్చేదేమో! కానీ, అలా వచ్చిన స్వాతంత్రంతో దేశం ఇప్పుడున్న విధంగా మాత్రం ఉండేది కాదు. దేశానికి ఈ గౌరవం, ప్రత్యేకత దక్కేవి కావు. నియంతృత్వ పాలనలో అశాంతి రాజ్యమేలుతూ.. ముక్కలు చెక్కలై.. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాకిస్థాన్ లా తయారయ్యేది. మహాత్ముడి సిద్ధాంతాలను, ఆశయాలను నాటి ప్రజలు, పాలకులు గౌరవించారు, పాటించారు కాబట్టే.. ప్రస్తుతం దేశం.. ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించగలిగింది. ఆయన సూచించిన శాంతి, సమానత్వం, అహింస, సర్వ మానవ సమానత్వం సిద్ధాంతాల ప్రాతిపదికన మన రాజ్యాంగం రూపొందింది కాబట్టే.. ఇంతటి సుస్థిరతను సాధించగలిగింది. ఎన్నెన్నో సంక్షోభాలను అవలీలగా అధిగమించగలిగింది. అతివాద భావాలతో నాడు స్వాతంత్రం కోసం పోరాడిన దేశభక్తులందరినీ అంతమొందించిన బ్రిటిష్ పాలకులకు.. ఈ బక్క పలచని మనిషిని చంపడం ఓ లెక్కా? కానీ.. వారు ఆ పని ఎందుకు చేయలేకపోయారు? గాంధీపై బ్రిటిష్ ఈగ వాలినా.. దేశం తిరగబడుతుందన్న భయం. అలాగే.. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక పద్దతిలో శాంతియుతంగా పోరాడారే తప్ప ఎక్కడా హింసను రెచ్చగొట్టలేదు. రక్తపాతాన్ని ప్రోత్సహించలేదు. అందుకే నాటి బ్రిటిష్ పాలకులు.. గాంధీని చంపే సాహసం చేయలేకపోయారు.
Must Read ;- ఓ మహాత్మా.. ఓ మహర్షీ.. : అహింసే ఆయన ఆయుధం

ప్రపంచానికే ఆదర్శం.. మహాత్ముడి పోరాటం
మన దేశ స్వాతంత్ర పోరాటాన్ని రెండు భాగాలుగా చూడవచ్చు. గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని చెప్పచ్చు. దాదాపు రెండున్నర శతాబ్దాల బ్రిటిష్ పాలనలో ఎందరో దేశభక్తులు తిరుగుబాటు చేశారు. వారికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ, ఆ పోరాటం ఆయా ప్రాంతాలకే పరిమితమైంది. వారికి తెలిసిన దేశం.. వారి రాజ్యం మాత్రమే. అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, రాణీ రుద్రమదేవి లాంటి వారందరూ వారి వారి ప్రాంతాలకు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడారు. వారి దృష్టిలో దేశమంటే.. వారి ప్రాంతమే. అందుకే.. ఆ పోరాటాలను అణచివేయడం బ్రిటిష్ వారికి తేలికైంది. కానీ, ఎప్పుడైతే గాంధీజీ దేశ స్వాతంత్ర్య పోరాట సంగ్రామంలో అడుగుపెట్టారో.. అప్పుడే స్వాతంత్ర్య ఆవస్యకత ప్రజలకు తెలిసొచ్చింది.
1920 తర్వాత సాగిన 27 ఏళ్ల ఉద్యమమే.. మొత్తం పోరాటాన్ని ఓ మలుపు తిప్పింది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా ముక్కలు చెక్కలుగా ఉన్న ప్రజల్లో.. మనదంతా ఒకే దేశం.. భారతదేశం.. అన్న భావన తెచ్చాడు ఈ బక్క మనిషి. దేశమంతా పర్యటించి.. ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చాడు. వారిని ఏకతాటిపైకి తెచ్చాడు. ఒక్క పిలుపుతో దేశాన్ని కదిలించాడు. శాంతియుత పోరాట మార్గాన్ని సూచించాడు. అహింస అనే బలమైన ఆయుధాన్ని వారికి అందించాడు. ప్రపంచంలోనే అత్యున్నత సైనిక, ఆయుధ సంపత్తి కలిగిన బ్రిటిష్ వారికి సహాయ నిరాకరణతో శాంతియుతంగా చుక్కలు చూపించాడు. గడ్డిపరకలను ఒక్కటి చేసి.. బ్రిటిష్ మదగజాన్ని దేశం నుంచి తరిమికొట్టాడు. ఇలా.. తూటా పేలకుండా.. రక్తం చుక్క నేల రాలకుండా.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రజ్యానికి పడమటి దిక్కును చూపించాడు. ఈ పోరాటం.. ప్రపంచాన్నే అబ్బురపరిచింది. ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది. నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చింది.
Also Read ;- ఉ. 11.00 గంటలు : మహాత్ముడి కోసం మౌనం పాటిద్దాం

జీవితమంతా పోరాటమే!
గాంధీజీ జీవితం పోరాటాల మయం. బారిష్టర్ చదువుకున్న గాంధీజీ.. 1920కి పూర్వం దక్షిణాఫ్రికాలో ఉండేవారు. అక్కడి నల్లజాతీయులపై బ్రిటిష్ పాలకులు సాగిస్తున్న దమనకాండకు నిరసనగా ఉద్యమం ప్రారంభించాడు. ఇలా.. దక్షిణాఫ్రికాలో స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికాడు. అక్కడ తెల్లవాళ్లు.. రైళ్లో నుంచి గాంధీని నెట్టివేసిన ఘటన.. ఆయన దృష్టిని భారత్ పై మళ్లేలా చేసింది. అక్కడి నుంచి నేరుగా భారత్ చేరుకున్న గాంధీజీ.. ఇక్కడి భారతీయుల దారుణ స్థితిగతులను చూసి చలించిపోయారు. అత్యధికశాతం భారతీయులకు ఒంటిపై చొక్కా కూడా లేని పరిస్థితి.. ఆయన్ను కదిలించింది. దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించాలన్న తపనను రగిలించింది. ‘నా భారతీయులకు ఒంటి నిండా దుస్తులు ధరించే స్థితి వచ్చే వరకు తాను చొక్కా ధరించనని’ ప్రతినబూనేలా చేసింది. అప్పటివరకు ఖరీదైన దుస్తులు ధరిస్తున్న గాంధీ.. నాటి నుంచి చేనేత దోవతి మాత్రమే ధరించేవారు. అలా.. చేనేత దోవతితో ఆయన మరో స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికారు. ఇక అక్కడి నుంచి ఆయన జీవితం పోరాటానికై అంకితమైపోయింది. ఆయన చేసినన్ని సత్యాగ్రహాలు, నిరశన దీక్షలు ప్రపంచంలో ఏ నేతా చేసుండడు. ఆయన ఆహారం తీసుకున్న రోజుల కన్నా.. నిరశన దీక్షలో కూర్చున్న రోజులే అధికమని ఆయన సన్నిహితులు కొందరు వ్యాఖ్యానించేవారు.
30 కోట్లమంది నమ్మకం..
నాటి 30 కోట్ల మంది భారతీయులు.. గాంధీపై నమ్మకంతో.. ఆయన వెంట నడిచేవారు. ఇదే నాటి బ్రిటిష్ పాలకులకు వెన్నులో వణుకు పుట్టించింది. అలాగే.. గాంధీజీపై గౌరవమూ పెంచింది. ఎంతలా అంటే.. గాంధీ.. ఓ ముద్దాయిలా కోర్టు హాల్లో అడుగుపెడితే.. నాటి బ్రిటిష్ జడ్జిలు సైతం లేచి నిల్చునేంతలా..! నిత్యం పోరాటాల మయంగా సాగిన ఆయన జీవితం.. దేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత కూడా ప్రశాంతంగా సాగలేదు. దేశ విభజనతో చెలరేగిన అల్లర్లు, మత ఘర్షణలు ఆయన మనసును వికలం చేశాయి. ఒకానొక సందర్భంలో తాను పాకిస్థాన్ కు వెళ్లిపోతాను అని ఆయన అనేలా చేశాయి. హిందూ అతివాదులు.. ముస్లింలపై చేస్తున్న దాడులకు నిరసనగా ఆయన మరోసారి నిరాహార దీక్షకు దిగారు. ఓ విధంగా ఇదే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీపై హిందూ వ్యతిరేకి అన్న ముద్ర వేసింది. నిజానికి ఆయన మెజారిటీ ప్రజలు సంయమనం పాటిస్తే.. అల్లర్లు ఆగుతాయని అలా చేశారే తప్ప.. ఏ ఒక్క వర్గానికో అనుకూలంగా మెలగలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కానీ, గాంధీని హిందూ వ్యతిరేకిగా భావించిన నాటి హిందూ అతివాది నాథూరాం గాడ్సే.. ఆయన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. బ్రిటిష్ వాళ్లే చేయలేని సాహసాన్ని.. ఓ భారతీయుడు చేశాడు. మన జాతిపితను పొట్టనబెట్టుకున్నాడు.
Also Read ;- బాపూజీకి ప్రముఖులు నివాళులు..

ఆరోపణ.. వాస్తవం..!
గాంధీజీ.. దేశ విభజనకు కారకుడు. గాంధీని విమర్శించే నేటి యువత.. ప్రధానంగా చేసే ఆరోపణ ఇదే. అవును.. నిజమే.. దేశాన్ని విభజించాలన్న నాటి బ్రిటిష్ పాలకుల ప్రతిపాదనను గాంధీజీ అంగీకరించారు. అప్పటి పరిస్థితుల్లో అది తప్పలేదు. నిత్యం కలహించుకుంటూ కలిసుండడం కంటే.. విడిపోయి కలిసుందాం.. అన్న ఆలోచనతో ఆయన అంగీకరించారు. ఒకవేళ నాడు ఆయన అంగీకరించకుండా ఉండి ఉంటే.. ఏమయ్యేది? దేశం.. ఓ పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ లా తయారయ్యేది. అల్లర్లతో అట్టుడికి పోతుండేది. అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచేది. నిత్యం మత ఘర్షణలతో, ఉగ్రదాడులతో రావణకాష్టంలా తయారయ్యేది. గాంధీజీ ముందుచూపు వల్లే.. దేశం నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
అధికారం ఆశించని మహా నాయకుడు
దేశాన్ని ఒక్కటి చేసి 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాడి.. ఒంటి చేత్తో స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడు.. ఏనాడూ అధికారం కోసం ఆశపడలేదు. ప్రధాని పదవి ఆయన కాళ్ల దగ్గరకు వచ్చినా.. తృణప్రాయంగా తిరస్కరించారు. మహాత్మ అనే బిరుదుకు సార్ధకత్వం చేకూర్చారు. నిజమైన జాతిపితగా నిలిచారు. ప్రపంచమంతా జేజేలు పలుకుతున్న ఈ అరుదైన నాయకుడిని.. భారతీయుల్లోనే అధిక శాతం మంది వ్యతిరేకిస్తుండడం మన దౌర్భాగ్యం. వాస్తవాలను యువతకు వివరించి.. మహాత్ముడి గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిన పాలకులే.. విమర్శకులకు వంత పాడుతుండడం మరింత ఆందోళనకరం. ఓ పార్టీ నాయకుడి విగ్రహానికి చిన్న దెబ్బ తగిలినా.. ఆగ్రహంతో రగిలిపోయే జనం.. మహాత్ముడికి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా పట్టించుకోకపోవడం విచారకరం.
గత సంవత్సరం.. అమెరికాలో జరిగిన అల్లర్లలో మహాత్ముడి విగ్రహానికి అవమానం జరిగితే.. అందుకు అమెరికా ప్రభుత్వం భారత్ కు క్షమాపణ చెప్పింది గానీ.. ఆ ఘటనపై ఒక్క భారతీయుడూ స్పందించకపోవడం.. నిజంగా మన దౌర్భాగ్యానికి నిదర్శనం. గాంధీపై బ్రిటిష్ వాళ్లు సినిమా తీశారు గానీ.. ఒక్క భారతీయుడికీ ఆ ఆలోచన కలగలేదు. ఆ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది గానీ.. భారత్ లో మాత్రం ఆదరణ పొందలేకపోయింది. ఏది ఏమైనా మహాత్ముడి ముద్ర నుంచి దేశం వైదొలగుతోందన్న మాట మాత్రం వాస్తవం. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం.. ఆందోళనకరం. దేశం కోసం సర్వం త్యజించిన ఈ మహానుభావుడిని గౌరవించడం.. ఆయన సిద్ధాంతాలను అనుసరించడం.. దేశానికి అత్యవసరం.
Also Read ;- భరతమాత హృదయ విజేత.. నేతాజీ.. (125వ జయంతి)..











