అమెరికా రాజకీయం క్లైమాక్స్ కు చేరినట్టే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైన సందర్భంగా జోబైడెన్ కు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అమెరికా క్యాపిటల్ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బైడెన్ ను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు భవనంలోకి చొరబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ట్రంప్ మాత్రం చాలా నాటకీయంగా వ్యవహరించారు. తన మద్దతు దారులు ఓర్పుతో వ్యవహరించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
సెనేట్ కార్యకలాపాలకు ఆటంకం
కేపిటల్ భవనంలో జరిగిన ఆందోళనతో సెనేట్ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. హౌస్ తలుపులను కూడా మూసివేశారు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు. ఆ భవనం లోపల ఉన్న మహిళ ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. యు.ఎస్. కాపిటల్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి మరింత దిగజారిపోవడంతో నగరవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
Must Read ;- కమలా హారిస్కు మోడెర్నా వ్యాక్సిన్