ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో 17500 ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి భూమి సిద్ధం చేశారు. ఇందులో ఇబ్రహీంపట్నం విజయవాడకు దగ్గరగా ఉండటంతో అక్కడ పేదల కోసం వేసిన వెంచర్ లో ప్లాట్లు అమ్ముకోవడం ద్వారా వైసీపీ పెద్దలకు కోట్లు కొల్లగొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఒకే చోట 400 ఎకరాల్లో వెంచర్ వేయడం, కొండపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంగా ఉండటంతో అక్కడ సెంటు భూమి రూ.4 లక్షలు పలుకుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని మైలవరం వైసీపీ ప్రజాపతినిధి చెలరేగిపోతున్నారు. ముందుగా కొందరు వైసీపీ శ్రేణులకు పట్టాలు ఇచ్చి, మిగిలినవి అమ్మకానికి పెట్టారు. దీంతో అర్హులైన నిరుపేదలు రోడ్డునపడ్డారు.
తెల్లకార్డు లేకున్నా ఓకే..
విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో వేసిన లేఅవుట్లో తెల్లకార్డు కూడా లేని వారికి 1500 మందికి పట్టాలు అమ్మారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సెంటు భూమిని వైసీపీ ప్రజాప్రతినిధి రూ.1.50 నుంచి రూ.2 లక్షల దాకా విక్రయిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రూ.30 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సెంటు భూమి పొందాలంటే తెల్లకార్డు కలిగి ఉండటం తప్పనిసరి అయినా ఇక్కడ అలాంటి నిబంధనలు గాలికొదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేదలకు రిక్తహస్తం
మైలవరం నియోజకవర్గంలో అర్హులైన పేదలను వదిలేసిన వైసీపీ నేతలు, చిలకలూరిపేట, నందిగామ, కైకలూరు నియోజకవర్గాల నుంచి తెచ్చుకున్న రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో ఇళ్ల స్థలాలు కొట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు లబ్దిదారుల లిస్టు తయారు చేసి రెవెన్యూ అధికారులకు పంపించిన వాటినే ఫైనల్ చేశారని తెలుస్తోంది. అర్హులైన పేదలు వేలాది మంది ఉన్నా వారిని వదిలేసి, లక్షల విలువైన ప్లాట్లు వైసీపీ నేతలు పంచుకుని అమ్ముకోవడంపై ప్రతిపక్షాలు ఉద్యమానికి సిద్దం అవుతున్నాయి.
టిడ్కో ఇళ్లు పొందిన వారికీ ఇళ్ల పట్టాలు
మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు అన్నీఇన్నీ కావు. వైసీపీ నేతలకు ఇప్పటికే ఇళ్లు ఉన్నా వారే మరలా స్థలాలు కాజేశారని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లు తీసుకున్న కొందరు నేతలు మరలా ఇళ్ల స్థలాలు తీసుకోవడంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పేదలకోసం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినా, వాటిల్లో 90 శాతం వైసీపీ నేతలు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.











