ఐపీఎల్ మినీ వేలం పాటలో సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక్కరూ తెలంగాణ వారు లేరని, తెలంగాణ (హైదరాబాద్)కు అన్యాయం జరిగిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో మంచి నైపుణ్యం ఉన్న క్రికెటర్లు చాలామంది ఉన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ కనీసం ఒక్కరిని కూడా తీసుకోకపోవడంపై దానం నగేందర్ వ్యాఖ్యానించారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఈ సీజన్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించడం సంచలనంగా మారింది. బాల్ ట్యాంపరింగ్లో దొరికిన డేవిడ్ వార్నర్ని కూడా జట్టు సారథిగా చేశారని, హైదరాబాద్ పేరు పెట్టుకుని కనీసం హైదరాబాద్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
కాగా .. జట్టుకి కెప్టెన్గా ఉన్నాడు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో స్థానికులకు అవకాశం కల్పించాలని లేని పక్షంలో పేరును మార్చుకోవాలని సూచించారు. ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా ట్విట్టర్ ద్వారా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఐపీఎల్ మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్క స్థానిక క్రికెటర్ను కూడా తీసుకోకపోవడంపై అజరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సన్రైజర్స్ జట్టులో హైదరాబాద్కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది” అని ట్వీట్ చేశారు.
నిధులు ఉన్నా..
ఇక వేలం విషయానికి వస్తే..హైదరాబాద్ జట్టులో ఒక్క స్థానిక క్రికెటర్ కూడా లేరు. కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ఈ ఫ్రాంచైజీకి సీఈఓగా ఉన్నారని, నిధులు ఉన్నా..వెచ్చించేందుకు ముందుకు రాలేదన్న విమర్శలు ఇప్పటికే వచ్చాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదనే కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు కూడా ఇలాంటి కామెంట్ల చేయడం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోనూ దీనిపై చర్చ జరగుతోంది. తాజాగా దానం నగేందర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది.
Also Read ;- ఐపిఎల్ చెన్నై జట్లులోకి.. కడప కుర్రోడు..
తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది పోటీ పడినప్పటికీ..
2013లో డెక్కన్ చార్జర్స్ స్థానంలో ఫ్రాంచైజీ తీసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ 2015 వరకూ నలుగురు స్థానికులను తీసుకుంది. 2017లో మహ్మద్ సిరాజ్ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. 2019లో రిక్కీ భుయ్ను తీసుకోగా, గతేడాది సందీప్ను తీసుకుంది. సీజన్ మధ్యలో ఏపీకి చెందిన పృథ్వీరాజ్ను తీసుకుంది. ఈ సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది పోటీ పడినప్పటికీ ఒక్కరిని కూడా తీసుకోలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన భగత్ వర్మ, హరి శంకర్రెడ్డి (CSK), యుధ్వీర్ సింగ్ (Mumbai), కేఎస్ భరత్ (RBC)కు చాన్స్ ఇచ్చాయి. గురువారం చెన్నైలో జరిగిన వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మొత్తం మీద ముగ్గురినే కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.3.8కోట్లు వెచ్చించింది. ఇంకా వేలం పాటకు కేటాయించిన రూ.6.95కోట్లు అందుబాటులో ఉన్నా.. స్థానిక క్రీడాకారులను కొనుగోలు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఈ టీంలో వార్నర్, విలియమ్సన్, బెయిర్స్టో, రషీద్ , భువనేశ్వర్, మనీశ్ పాండే వంటి ప్లేయర్లు ఉన్నారు. టెస్ట్ మ్యాచ్లలో రాటుదేలిన అనుభవం ఉన్న హనుమవిహారీ స్ట్రోక్ ప్లేయర్. అయినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
ఇక అండర్ -19 వరల్డ్ కప్లో ఆల్ రౌండర్ ప్రతిభ చూపిన తిలక్ వర్మతోపాటు సందీప్, యుధ్వీర్, తనయ్, భగత్ వర్మ, అజయ్ కూడా అందుబాటులో ఉన్నారు. వీరిపై ఆసక్తి చూపించని సన్రైజర్స్ కేదార్ జాదవ్ను రూ.2 కోట్లకు తీసుకుంది. వీరు కాకుండా విదేశీ కోటాలో ముజీబ్ జద్రాన్ను, మరో స్లాట్లో థర్డ్ ప్లేయర్గా కర్నాటక స్పిన్నర్ జగదీశ్ సుచిత్ను తీసుకుంది. చివరికి స్పిన్నర్ భగత్ వర్మ రూ.20లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. హైదరాబాద్ పట్టించుకోలేదు. దీంతో CSK అతడిని కొనుగోలు చేసింది. ఇలా హైదరాబాద్కు చెందిన వారు అందుబాటులో ఉన్నా అదే టాలెంట్ ఉన్నా.. పట్టించుకోకపోవడంపై ఇప్పటికే ప్రశ్నలు తలెత్తాయి. సన్రైజర్స్ హైదరాబాద్ తనకు అచ్చొచ్చే స్టేడియంగా ఉప్పల్ స్టేడియానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. అయితే స్టేడియం వినియోగించుకోవడానికి ఇస్తున్న ప్రియార్టీ కనీసం హైదరాబాద్ ఆటగాళ్లకు లేకపోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానం నగేందర్, అజారుద్దీన్ లాంటివాళ్లు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
Must Read ;- ఐపీఎల్లో తొలిసారిగా సచిన్ తనయుడు.. ధరెంతో తెలుసా?
Very disappointed not to see a single player from Hyderabad in the Hyderabad Sunrisers Team #IPLAuction @SunRisers @IPL
— Mohammed Azharuddin (@azharflicks) February 18, 2021











