మోహన్ లాల్, ఉన్నిముకుందన్, జయరామ్ లాంటి మలయాళ నటులు టాలీవుడ్ లో ప్రధాన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. వీరు ముగ్గురూ ఇప్పుడు మళ్ళీ వివిధ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరి లిస్ట్ లోకి కొత్తగా మాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఫహద్ ఫాజిల్ కూడా వచ్చి చేరాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లోని క్రేజీ మూవీ ‘పుష్ప’లో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మాలీవుడ్ లో ఫహద్ ఫాజిల్ వైవిద్యమైన పాత్రలకు పెట్టింది పేరు. పాత్ర నచ్చాలే కానీ.. విలన్ గానైనా నటించడానికి వెనుకాడడు. మలయాళంలో గతంలో ‘22 ఫిమేల్ కొట్టాయం, కుంబళంగి నైట్స్’ లాంటి సినిమాల్లో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘పుష్ప’ తెలుగు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఆ పాత్రను చేయడానికి ఫహద్ భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
‘పుష్ప’ సినిమాలోని తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండడంతో సినిమాలో నటించడానికి ఒప్పుకోవడమే కాకుండా.. రూ. 5కోట్లు డిమాండ్ చేశాడట ఫహద్. అయితే ఆ పాత్రకు అతడైతేనే న్యాయం చేస్తాడని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు.. జీయస్టీ తో కలిపి రూ. 5కోట్లు ఇవ్వడానికి అంగీకరించారట. ఈ స్థాయిలో తెలుగులో పారితోషికం అందుకున్న మలయాళ నటుడు ఫహద్ ఫాజిలే కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆగస్ట్ 13 న పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల కానున్న ‘పుష్ప’ సినిమా ఫహద్ విలనిజం ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.
Must Read ;- ఫాహద్ తో మల్లు అర్జున్ ‘పుష్ప’ మార్కెట్ మ్యాజిక్