Mudragada Padmanabham Writes Letter To AP CM Jagan On Film Industry Issues :
ఓ వైపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు, మరోవైపు ఏపీలోని జగన్ ప్రభుత్వ ప్రతినిధులు.. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సినిమా పరిశ్రమను ఆదుకునే దిశగా పెద్ద చర్చలే నడుస్తున్నాయి. ఇప్పటికే జగన్ తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలంతా భేటీ అయ్యారు. ఆ తర్వాత బాగా గ్యాప్ వచ్చినప్పటికీ.. సోమవారం నాడు నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మండలి ప్రతినిధులు మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందుగానే సినిమా టికెట్ల ఆన్లైన అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించేలా.. అలా వచ్చిన సొమ్ములో నుంచి ప్రభుత్వ పన్నులను తీసేసుకున్న తర్వాత మిగిలిన సొమ్మును నిర్మాతలకో, ఎగ్జిబిటర్లకో అప్పగించే దిశగా జగన్ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఓ జీవో కూడా జారీ అయ్యింది. అయితే ఈ ప్రతిపాదన ఎవరు చేశారన్న దానిపై పూర్తి స్థాయి క్లారిటీ లేదు. సినీ పెద్దలే ఈ ప్రతిపాదన చేశారని పేర్ని నాని చెబుతుంటే.. ఈ మాట సినీ పెద్దల నుంచి మాత్రం అంత గట్టిగా వినిపించడం లేదు. ఒకరిద్దరు సినీ ప్రతినిధులు ఈ మాట నిజమేనని చెప్పినా.. ఏపీ ప్రభుత్యంతో చర్చల విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించిన చిరు మాత్రం దీనిపై నోరు విప్పలేదు. ఇలాంటి సమయంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నుంచి జగన్ సర్కారుకు ఓ లేఖాస్త్రం దూసుకువచ్చింది.
లేఖలో ముద్రగడ ఏమంటారంటే..?
సీఎం జగన్ కు రాసిన లేఖలో ముద్రగడ పద్మనాభం చాలా అంశాలను ప్రస్తావించారు. ఆన్లైన్లోనే టికెట్లు అమ్మాలని, అలాగే రెమ్యూనరేషన్లను కూడా ప్రభుత్వమే నిర్మాతల నుంచి వసూలు చేసి నటులకు చెల్లించాలని కూడా సూచించారు. ఈ లేఖలో ముద్రగడ ఏమంటారంటే.. ‘‘సినిమా టిక్కెట్లు ఆన్ లైన్లో విక్రయించేలా చూడాలని ప్రముఖ నటులు తమరిని కోరిన విషయం ఎమ్.ఎల్.ఎ రోజా గారు మరికొందరు పెద్దలు స్పష్టం చేసిన సంగతి పత్రికలో చూసానండి. ఆ గౌరవ ప్రముఖ నటులు కోరిన విధానం చాలా మంచిదండి, నేను ఒక మాజీ ఎగ్జిబిటర్ చేసిన ఈ దిగువ సూచనను అందరూ గౌరవించాలని కోరుచున్నానండి. అలాగే చిత్రం నిర్మాణం కోసం నటించే హీరో, హీరోయిన్లు మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు వారికి ఇచ్చే కిరాయిలు అన్నియు మరియు కేరావేన్లు, ఇతర వాహనాలకు, రూమ్ అద్దెలకు, టిఫిన్లు, భోజనాలు వగైరా అన్నింటికి నిర్మాత గారి నుండి మొత్తం డబ్బు అంతా ప్రభుత్వం జమ చేయించుకుని ఆన్లైన్లో టిక్కెట్లు మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి పంపే విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. దుబారా, ఎగవేతలు ఉండవండి. ప్రతీ పైసా ఖర్చు వివరములు అద్దంలో చూసుకున్నట్లు ఉంటాయండి. ఎక్కడా నలుపు, తెలుపు ధనం పదాలు వినపడవు, పూర్తి తెలుపు ధనం తోటే వ్యాపారం అవుతుందండి. దీనికి తోడు నిర్మాణానికి కోట్ల ఖర్చు పూర్తిగా తగ్గు ముఖం పడుతుందండి. దయచేసి గౌరవ నటులు సూచనలతో పాటు, ఈ సూచన కూడా పరిగణనలోనికి తీసుకుని అలోచించమని కోరుచున్నానండి’’ అంటూ తనదైన స్టైల్లో ముద్రగడ.. జగన్ కు రాసిన లేఖలో సంచలన అంశాలను ప్రస్తావించారు.
వ్యంగ్యమా?.. సూచనా?
వాస్తవంగా ముద్రగడ పద్మనాభం ఎవరికి లేఖలు రాసినా.. ఏ అంశాల మీద లేఖలు రాసినా.. ఇప్పుడు జగన్ కు రాసిన లేఖలో మాదిరే ఎదుటి వ్యక్తులను చాలా గౌరవిస్తూ ప్రస్తావనలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మేందుకు సిద్ధమైన వైనంపై జనాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సినిమా జనాల నుంచి కూడా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. అయితే అసలే తనదైన మార్కు పాలనతో సాగుతున్న జగన్ సర్కారుతో వైరం పెట్టుకునే ధైర్యం లేక సినీ పెద్దలు నోరిప్పడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ లేఖ రాశారంటే.. అందులోనూ రెమ్యూనరేషన్లను కూడా ప్రభుత్వమే నిర్మాతల నుంచి వసూలు చేసి నటులకు అందించాలని సూచన చేసిన వైనాన్ని చూస్తుంటే.. జగన్ సర్కారు తుగ్లక్ తరహా నిర్ణయం తీసుకుందన్న కోణంలోనే సెటైర్లు సంధిస్తూ ముద్రగడ లేఖ రాశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.