ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీరే వేరు. ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఆయన ముందుంటారని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతుంటారు. ఏదైనా ప్రెస్ మీట్ పెడితే.. అసలు విషయం పక్కనపెట్టి, టీడీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకుంటారని ఒక అపవాదు కూడా ఉంది. ఆయన నోటి దురుసు వల్ల పార్టీకి, ముఖ్యంగా జగన్ సర్కార్ కు తీవ్ర నష్టం కలుగుతుందనే విషయాన్నిపూర్తిగా మరిచిపోయారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఇంటర్ పరీక్షల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ లాంటి విషయాలపై పోరాటం చేస్తుండటంతో మంత్రి కొడాలి నానికి ఏమాత్రం మింగుడు పడటం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
లోకేష్ జోలికి వస్తే తాటతీస్తా
మంత్రి నాని లోకేష్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై.. నందమూరి చైతన్య కృష్ణ మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. లోకేష్ జోలికివస్తే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొడాలి నానికి బూతుల మంత్రి అని పేరుందని, నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఒక మంత్రి హోదాలో ఉండి వెధవ, సన్నాసి లాంటి పదజాలం ప్రయోగించడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. గతంలో ఐటీమంత్రిగా ఉన్న లోకేశ్ ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, లోకేశ్, చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత మంత్రి నానికి లేదని నందమూరి చైతన్య కృష్ణ హెచ్చరించారు.
పాలనపై దృష్టి పెట్టండి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ మచ్చలేని నాయకులు అని చైతన్య కృష్ణ అన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ అయ్యిందని, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని విమర్శించారు. ఏపీలో 12 వేల కిలోమీటర్ల రహదారిని వేయడంలో లోకేష్ పాత్ర ఉందని గుర్తుచేశారు. ఇప్పటికైనా మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకొని పాలనపై దృష్టి పెట్టాలని నందమూరి చైతన్య సూచించారు.
Must Read ;- లోకేష్కు ఎక్కడ పేరు వస్తుందోనని.. పరీక్షలు రద్దు చేయని జగన్