చీరాల థామస్పేటకు చెందిన వై.కిరణ్కుమార్ (26), ఫ్రెండ్ వి.షైనీ అబ్రహంతో గతేడాది టూ వీలర్ పై కొత్తపేట నుంచి చీరాలకు వెళ్లారు. అయితే మాస్క్ పెట్టుకోలేదని కొత్తపేట చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అక్కడ యువకులకు, పోలీసులకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న టూ టౌన్ ఎస్ఐ విజయ్కుమార్ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఎస్ఐ తీవ్రంగా కొట్టడంతో కిరణ్ కుమార్ తలకు గాయం అయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం కిరణ్ను గుంటూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. అయితే ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు తలెత్తాయి. దళిత యువకుడి మరణానికి ప్రభుత్వమే కారణమంటూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఘటనకు ఏడాది
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒకచోట దళితులపై దాడి జరుగుతోందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేవలం మాస్క్ ధరించలేదనే కారణంతో దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరిగి ఏడాది కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. దళితులంటే సీఎం జగన్రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్కుమార్ను మాస్క్ లేదని, వైసీపీ పోలీసులు కొట్టి చంపి ఏడాదైందని గుర్తుచేశారు. నిందితులైన పోలీసులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, జగన్రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? అని లోకేష్ ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోవడమే నేరమైతే.. రోజూ మాస్క్ పెట్టుకోని జగన్రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కిరణ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని, కిరణ్కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Must Read ;- నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధంకండి!











