మనం ఓ ఇల్లు కట్టుకుంటే.. దానికి మన పేరో.. మనకు నచ్చిన ఇంకేదైనా పేరో పెట్టుకుంటాం. ఎందుకంటే.. అది మన కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు కాబట్టి. కట్టించింది తను కదా అని.. తాపీ మేస్త్రీ మన ఇంటికి తన పేరు పెట్టుకుంటే! ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరుగుతోంది ఏపీలో. ప్రజల భూములు ప్రజలకే పంచుతూ.. వారి సొమ్ముతో వారికే ఇళ్లు కట్టిస్తూ.. ఆ సమూహాలకు ముఖ్యమంత్రిగారి పేరు పెట్టడంలో ఔచిత్యమెంతో అధికార పెద్దలకే తెలియాలి.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాలు పంచుతా.. పంచుతా.. అంటూనే ఉన్నారు. కోర్టు మొట్టికాయలో.. మరేదో కారణమో.. అది ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నారు. అదేమంటే.. నింద చంద్రబాబుపై వేయడం కామనైపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎప్పుడో కట్టించిన ఇళ్లనేమో సమాధి చేసేసి.. ఇప్పుడు కొత్తగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అంటున్నారు. సరే.. అవన్నీ కాసేపు పక్కనపెడతాం.
ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ పరిధిలో ఆయన పంచాలనుకుంటున్న ప్రజా భూమికి తన పేరిట నామకరణం చేసేసుకున్నారు. ‘జగన్మోహనపురం’ అనే పేరుతో అప్పుడే ఓ ఆర్చి కూడా నిర్మించేశారు. ఇది మంత్రి కన్నబాబు ఆలోచనట! మరి ఆయనకు ఈ దిశగా ఆదేశం ఎవరిచ్చారో మరి! ఇల్లూ లేదు.. పట్టా లేదు.. కాలనీ పేరు మాత్రం జగన్మోహనపురమట. ఇక్కడ ఎవరి సొమ్ము ఎవరు ఎవరికి ఇస్తున్నట్లు! తుఫాను బాధితులకు మన జగన్ గారు.. తన జేబు లోంచి సొమ్ముతీసి ఓ కాలనీ కట్టించి.. దానికి తన పేరు పెట్టుకుంటే.. ఎవ్వరూ అడగరు. పైగా అభినందిస్తారు. లేదా.. ప్రజలే స్వచ్ఛందంగా అభిమానంతో పెట్టుకున్నా.. ఎవరికీ అడిగే హక్కులేదు. అంతేగానీ.. ఈ చీప్ పాలి‘ట్రిక్స్’ ఏంటి జగన్ గారూ..!
Must Read ;- ‘చెత్త’ ఐడియా : జగన్ జమానాలో బ్యాంకులకూ బెదిరింపులు











