ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మడ అడవులను నరికేసినట్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన ప్రత్యేక బృందం తేల్చింది. అవి మడ అడవులు కాదని ఇంతకాలం వైసీపీ ప్రభుత్వం బుకాయించింది. అయితే అందులో నిజం లేదని ఎన్జీటీ అధికారులు తేల్చారు. దీంతో బాధ్యులైన అధికారుల మెడకు ఇప్పుడు ఈ కేసు చుట్టుకోనుంది. మడ అడవులు నరికి వేయడం వల్ల కలిగిన నష్టం, వాటి పునరుద్దరణకు అయ్యే ఖర్చు కూడా తేల్చాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ఖర్చులు కూడా మడ అడవులు నరికివేయించిన అధికారుల నుంచి వసూలు చేయాలని ఎన్జీటీ నిర్ణయించింది. మడ అడవులు చదును చేసేందుకు కాకినాడ కార్పొరేషన్ ద్వారా రూ.12 కోట్లు ఖర్చు చేశారు. ఇవి మడ అడవులు అని తేలడంతో ఇప్పుడు కార్పొరేషన్ పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
అడుగడుగునా అడ్డంకులే..
కాకినాడ సమీపంలో భూములు అందుబాటులో లేకపోవడంతో దుమ్ములపేట సమీపంలోని యాంకరేజి పోర్టు నుంచి 112 ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకుంది. కాకినాడ నగరానికి చెందిన దాదాపు 25 వేల మందికి సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మడ అడవులను నరికివేసి, రూ.12 కోట్ల ఖర్చుతో మెరకవేసి ప్లాట్లు వేశారు. దీనిపై పర్యావరణ వేత్తలు ఆనాడే ఆందోళన చేశారు. అయినా ఇవి మడ అడవులు కాదని ప్రభుత్వం బుకాయించింది. అయితే దీనిపై విశాఖకు చెందిన పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ నేషనల్ గ్రీన్ ట్రీబ్యునల్ను ఆశ్రయించడంతో, క్షేత్ర స్థాయిలో పరిశీలనకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. శాటిలైట్ ఫిక్చర్స్ ఆధారంగా పరిశోధన చేసిన ఎన్జీటీ అధికారులు అక్కడ మడ అడవులు నరికేశారని తేల్చారు.
వన్యప్రాణుల చట్టాలను కూడా తుంగలో తొక్కారు
మడ అడవులను నరికివేయడం ద్వారా కేవలం పర్యావరణ చట్టాలను మాత్రమే కాకుండా వన్యప్రాణుల చట్టాలను కూడా కాలరాశారు. కాకినాడ సమీపంలో నరికివేసిన మడ అడవులను పరిశీలించేందుకు ఎన్జీటీ నియమించిన ప్రత్యేక బృందం డిసెంబరు 10న క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. చెట్లు నరికివేసి సిద్దం చేసిన లేఅవుట్తో పాటు, సహజసిద్ద కాలువలను కూడా పూడ్చి వేయడాన్ని అధికారులు గుర్తించారు. అయినా అక్కడ మడ అడవులు లేవని జేసీ లక్ష్మీశ, డీఎఫ్వో వాదనలు వినిపించారు. అక్కడ ఎలాంటి మడ అడవులు లేవని, గతంలో అక్కడ రొయ్యల చెరువులు సాగు చేశారని ఎన్జీటీ ప్రత్యేక బృందం ముందు వాదనలు వినిపించారు. అవన్నీ రెవెన్యూ భూములని, అక్కడక్కడా చెట్లు ఉంటే తుఫానులకు అవికూడా పోయాయని అడ్డంగా వాదించారు. అయినా పర్యావరణ వేత్తలు అవి మడ అడవులేనని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎన్జీటీ అధికారులకు శాటిలైట్ ఫోటోలు అందించారు. గూగుల్ ఎర్త్లో మడ అడవులను గుర్తించారు. ఉప్పుటేరు పిల్లకాలువ, చదును చేసిన చోట మరలా పుట్టుకు వస్తున్న మడ అడవుల ఫోటోలను ఎన్జీటీ అధికారులకు అందించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఇరకాటంలో పడ్డారు. తాము చెప్పినవన్నీ అబద్దమని తేలడంతో వారు తెల్లమొహం వేశారు.
వారి నుంచే వసూలు చేయండి
మడ అడవులు నరికివేయడంలో కీలక పాత్ర వహించిన రెవెన్యూ అధికారుల నుంచే ఖర్చు చేసిన మొత్తాలను వసూలు చేయాలని ఎన్జీటీ నిర్ణయించింది. ఇప్పటి వరకు అక్కడ ఎంత ఖర్చు చేశారు, మడ అడవుల పునరుద్దరణకు ఎంత ఖర్చువుతుంది, అనేది వెంటనే తేల్చాలని ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు ఎన్జీటీ ప్రత్యేక బృందం అధికారులు మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఆ తరవాత మడ అడవుల పునరుదర్ధరణ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- పోలవరంపై జగన్ సర్కారు రివర్స్ గేమ్.. మిగిలిన దాని కన్నా మోయాల్సిందెంతో..!