ఈ సృష్టిలో లేదా ఈ బ్రహ్మాండంలో అత్యంత పెద్ద పదవి బ్రహ్మ పదవే. రాబోయే కల్పంలో ఈ పదవిని ఆంజనేయుడు అధిష్ఠిస్తాడని విష్ణు పురాణం చెబుతోంది. భవిష్య పురాణం దీన్ని బలపరుస్తోంది.
శ్రీరామ పట్టాభిషేకం సమయంలో రాముడు తన సోదరుల మీద కూడా చూపని ప్రేమను ఆంజనేయుడి మీద చూపించారు. శ్రీరాముడు విష్ణువు అవతారమే కాబట్టి హనుమకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు. రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా శ్రీరాముడే అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి. మనకున్న 14 కల్పాలలో ఇప్పుడు మూడో కల్పమైన శ్వేత వరాహ కల్పం నడుస్తోంది. ఇక్కడ వరాహం అనే పేరును మనం ప్రముఖంగా గుర్తుంచుకోవాలి.
వరాహుడు ఇచ్చిన స్థలంలోనే వేంకటేశుడు కొలువుదీరాడన్న విషయాన్ని మనం మరువ కూడదు. ఈ ప్రాంతంలోనే ఆంజనేయుడు కూడా జన్మించాడని పరిశోధకులు ధ్రువీకరించిన విషయం విదితమే. 14 కల్పాలలో కూర్మ కల్పం, మత్స్య కల్పం ముగిసి శ్వేతవరాహ కల్పంలో మనం అడుగుపెట్టాం. ఈ కల్పం ముగిసి ఆంజనేయుడు బ్రహ్మగా రావాలంటే నాలుగోదైన నృసింహ కల్పంలోనే సాధ్యం. సృష్టి రహస్యం బహిర్గతం కావాలంటే మనకు పురాణాలు తప్ప మరో ఆధారం కనిపించడం లేదు.
వేంకటేశుడి సేవలోనే..
ఆంజనేయుడు తిరుమల కొండపై పుట్టి వేంకటేశుడి సేవలో తరించాడని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాహిత్య ప్రమాణాలు కూడా తోడయ్యాయి. ఇప్పుడు పరిశోధకులు కూడా తేల్చి చెబుతున్నారు. మనుకున్న అష్టాదశ పురాణాల్లో 12 పురాణాల్లో ఆంజనేయుడి పుట్టుకకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. వరాహపురాణంలో ప్రస్తావించిన వేంకటాద్రే అంజనాద్రిగా తేల్చారు. దేవతలందరరూ అంజనాదేవికి దీన్ని అంజనాద్రి అంటారని వరమిచ్చారని చెబుతారు. అంజనాదేవి వేంకటాచలం మీదే తపస్సు చేసింది.
అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థంలో హనుమంతుడు జన్మించాడు అని పరిశోధకులు తేల్చారు. తిరుమల కొండకు అంతటి విశిష్టత ఉంది. తిరుపతికి 10 కిలో మీటర్ల దూరంలో బేడీ అంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఆసక్తికర కథ కూడా ఉంది. చిన్నప్పుడు ఒంటె కోసం వెతుకుతున్న హనుమంతుణ్ణి తల్లి అంజనాదేవి కట్టేసి ఆకాశగంగకు వెళ్లిందట. అందుకే ఇక్కడి హనుమంతుడిని బేడీ ఆంజనేయస్వామి అని పిలుస్తారు. ప్రతి రోజు హనుమంతుడు ఈ ప్రాంతంలో నిలుస్తాడని భక్తుల నమ్మకం.
జన్మస్థలిపై భిన్న ప్రచారాలు
ఆంజనేయుడి జన్మ స్థలం మీద అనేక ప్రచారాలు ఉన్నాయి. మన దేశంలో అనేక ప్రాంతాలను ఆంజనేయుడి జన్మస్థలంగా చాలామంది భావిస్తారు. అక్కడ ఆలయాలు కూడా కట్టారు. కర్ణాటకలో తుంగభద్రా నది తీరంలో అనెగొంది ప్రాంతంలో కూడా అంజనాద్రి ఉంది. దీన్ని కిష్కిందగా పిలుస్తుంటారు. ఇక్కడ రామాయణం ప్రస్తావించిన రుష్య మూక పర్వతం ఉంది. హనుమంతుడు సీతమ్మవారితో తాను సముద్ర తీరంలోని గోకర్ణలో జన్మించానని చెప్పారని, ఆ ప్రకారం గోకర్ణ హనుమంతుడి జన్మస్థానం కావచ్చనే వాదన ఉంది. మహారాష్ట్రలోనూ హనుమ జననం జరిగిందన్న వాదన ఉంది.
గోదావరి నది పుట్టిన నాసికా త్రయంబానికి చేరువలో అంజనీదేవి తపస్సు చేసిందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో కూడా ఓ ఆంజనేయుడి ఆలయం ఉంది గుజరాత్లోని దంగ్ జిల్లా నవ్సారి ప్రాంతంలో అంజనీ గుహ ఉంది. ఈ గుహలో ఆంజనేయుడు పుట్టారనే వాదన కూడా ఉంది. జార్ఖండ్లోని గుమ్లా జిల్లా కేంద్రానికి సమీపంలో అంజన్ అనే ఊరు ఉంది. వాలీ, సుగ్రీవుల రాజ్యాలు కూడా ఇక్కడివేనంటారు. ఆ ప్రకారం చూస్తే హనుమంతుడు ఇక్కడే పుట్టాడని అనుకోవాలి. హర్యానాలోని కైతల్ పట్టణానికి ఒకప్పటి పేరు కపితల్ అంటారు. ఆంజనేయుడు పుట్టిన ఊరు ఇదేననే నమ్మకం ఉంది. ఇలాంటి ప్రచారాల వల్ల ఆంజనేయుడి జన్మస్థలిపై వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాలు అన్నిటికీ టీటీడీ ఓ ముగింపునిచ్చింది.
– హేమసుందర్
Must Read ;- తిరుమల గిరులే ఆంజనేయుడి జన్మస్థలం : టీటీడీ అధికారిక ప్రకటన











