పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇవాళ నెల్లూరులో పర్యటించారు. ఏ జిల్లాలోనైనా ఏకగ్రీవాలు ఒక స్థాయిదాటితే అది అధికారుల వైఫల్యం కిందకే వస్తుందని ఆయన సుతిమెత్తగా అధికారులను హెచ్చరించారు. గ్రామాల్లో నాయకత్వ బాధ్యతల కోసం అభ్యర్థులు పోటీపడటం శుభపరిణామమని నిమ్మగడ్డ అన్నారు. స్థానిక ఎన్నికల వల్ల గ్రామాల్లో గొడవలు వస్తాయని తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు అయిపోయాక అందరూ కలిసే ఉంటారని నిమ్మగడ్డ అన్నారు.
గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 85 శాతం పోలింగ్ అయిందని, ఈసారి అంతకన్నా ఎక్కువే అయ్యే విధంగా అధికారులు ప్రచారం చేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరలా జరక్కుండా చూసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తనను ఎంతో మంది విమర్శించినా తాను పట్టించుకోనని, తనపని తాను పూర్తి చేసుకుంటానన్నారు. ఎవరినీ విమర్శించే కుసంస్కారం తనకు లేదన్నారు.
Must Read ;- టార్గెట్ 90% : మంత్రుల గుండెళ్లో రైళ్లు!