ఈ తరం కథానాయికలు ఈ భాషా .. ఆ భాషా అనేది లేకుండా, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అల్లుకు పోతున్నారు. ఎక్కడ సక్సెస్ లు దక్కితే అక్కడ దూసుకుపోతున్నారు. ఎక్కడైతే స్టార్ డమ్ దక్కుతుందో అక్కడ ఆ ప్లేస్ ను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారు. అలాంటి అందమైన కథానాయికలలో కీర్తి సురేశ్ ఒకరిగా కనిపిస్తుంది. ‘నేను శైలజ’ సినిమా చూసినప్పుడు, పిల్ల ముద్దుగా .. బందరులడ్డూలా ఉందే అనుకున్నారు. కానీ ఇంతత్వరగా ఇంతపెద్ద స్టార్ అవుతుందని మాత్రం అనుకోలేదు. అలా ఒక్కసారిగా కీర్తి సురేశ్ తెలుగులో స్టార్ హీరోయిన్ ప్లేస్ ను సొంతం చేసుకుంది.
‘నేను లోకల్’ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేశ్, ఆ తరువాత ‘మహానటి‘ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. సావిత్రి జీవితచరిత్రగా వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతిచోటున వసూళ్ల వర్షం కురిపించింది. సావిత్రి పాత్రను పోషించడం ఈ కొత్తపిల్ల వల్ల ఏమౌతుంది? అనుకున్న వాళ్లు ఈ అమ్మాయి నటన చూసి, ‘ఔరా!’ అనేశారు. అంతటి ప్రతిభను కనబరిచిన కారణంగానే, 2020 సంవత్సరానికిగాను, ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది.
ప్రతి ఏడాదిలానే గత ఏడాది కూడా ఫోర్బ్స్ దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. దశలవారీగా ఫిల్టర్ చేసిన తరువాత, ఫైనల్ జాబితాను ఖరారు చేసింది. 2020 సంవత్సరానికి గాను, ఇండియాలో అత్యంత ప్రతిభాశీలురైన నటీమణుల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. మొత్తం 30 మంది జాబితాను ప్రకటించగా, వారిలో కీర్తి సురేశ్ కి స్థానం లభించడం విశేషం. సౌత్ ఇండియాలో ఒక్క కీర్తి సురేశ్ కి మాత్రమే ఈ అవకాశం దక్కడం అరుదైన విషయం. దాంతో అంతా కూడా ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది తనకి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టుగా చెబుతూ కీర్తి సురేశ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తెలుగు సినిమాలు .. రెండు తమిళ .. రెండు మలయాళ సినిమాలు ఉండటం విశేషం.
Must Read ;- బోటింగ్ తో సందండి చేసిన కీర్తి సురేష్