( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై దృష్టి సారించింది. ఎన్నికల్లో వారి సేవలు వినియోగించుకోరాదని స్పష్టం చేసింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మున్నిపల్ ఎన్నికలకు వారిని దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కానీ ఆ ఆదేశాల అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. అలా చెప్పే కన్నా.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటే సబబేమో!.
ప్రచారం చేయాలని వాలంటీర్లకు బెదిరింపులు..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ucd ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వై శ్రీనివాసరావు, డి ఎం సి నాగరాజు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్కు భారత కమ్యూనిస్టు పార్టీ తరపున జిల్లా కార్యదర్శి లోకనాథం, ఆర్ కె ఎస్ వి కుమార్ సోమవారం ఫిర్యాదు చేశారు. వారు మెప్మా ఆర్పిలు, వాలంటీర్ల పై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేయాలని, వాళ్ల పరిధిలో ఉన్న డ్వాక్రా గ్రూపుల లీడర్లతో సమావేశాలు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మెప్మా ఆర్పిలను వార్డ్కి ఐదుగురు చొప్పున ఋషికొండ వద్ద ఉన్న వైయస్సార్ ఎంపీ విజయసాయిరెడ్డి వద్దకు తీసుకెళ్లి సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు. వైఎస్సార్సీపి అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం చేయాలని, లేకుంటే ఉద్యోగాలు పోతాయని బెదిరింపులకు పాల్పడినట్టు రమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కనుక ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, నాగరాజుపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ముగిసేవరకు వార్డు వాలంటీర్లు ఇంటింటికీ తిరగకుండా చర్యలు తీసుకోవాలని, వారి వద్ద ఉన్న ప్రభుత్వ ఫోన్లను స్వాధీనపరచు కోవాలని సమర్పించిన లేఖలో కోరారు. ఈ లెక్కన విశాఖలో వాలంటీర్ల సాయంతో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని అధికార పార్టీ కుయుక్తులు పొందుతున్నట్టు తేటతెల్లమైంది. ప్రతి ఇంటిలో ఉండే ఓటర్లతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండే వాలంటీర్లు కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసే ప్రక్రియ ప్రారంభించారని స్పష్టమవుతోంది.
వాలంటీర్ల సేవలను నిషేధిస్తూ..
వాలంటీర్ల సేవలు ఎన్నికల ప్రచారంలో వినియోగించవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రచారం నిర్వహిస్తున్నారని తిరుపతిలో రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశంలో గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ పథకాల అందజేత, ఓటర్ల పూర్తి వివరాలు, వారితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండే వాలంటీర్ల సాయంతో లబ్ధి పొందాలని చూస్తున్నట్టు కమిషనర్ రమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాలంటీర్ల సేవలను ఎన్నికల్లో నిషేధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లపై పలు ఆంక్షలు విధించింది. వారి ఫోన్లలో లబ్దిదారుల డేటా దుర్వినియోగం అవ్వకుండా చూడాలని ఈసీ నిమ్మగడ్డ అధికారులకు సూచించారు. వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా ఉంచాలని కలెక్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. వారు పత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. ఎన్నికల వ్యవహారంలో తలదూర్చకుండా చూసుకోవాలని నిమ్మగడ్డ చెప్పారు. వాలంటీర్ల చేత ఓటరు స్లిప్ల పంపిణీ లాంటి పనులు చేయకూడదని కూడా తెలియజేశారు. ఈ ప్రక్రియను కష్టమైనా ప్రభుత్వమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొన్నట్టు రుజువులతో సహా నిరూపితమైతే.. అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట కి వ్యతిరేకమని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు వ్యతిరేకంగా హద్దు మీరితే క్రిమినల్ చర్యలకు కూడా అవకాశం ఉందని హెచ్చరించారు. వాలంటీర్లు అంతా ఈ విషయాన్ని గుర్తించి తమ పరిధి దాటకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటింటి ప్రచారంపైనా ఆంక్షలు..
కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రచారానికి ఐదుగురు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఇంటింటికీ వెళ్లి చేసే ప్రచారంలో 5 గురు మించి అభ్యర్థుల వెంట ఉంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు నిఘా పెంచాలని కలెక్టర్,ఎస్పీ,సీపీ లకు ఎస్ఈసి ఆదేశాలు జారీ చేశారు. డబ్బు,మద్యం పంపిణీలను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.











