బాదుడే .. బాదుడు! భరించేలేనంత బాదుడు!
జగన్ రెడ్డి .. ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని సుస్పష్టం. ప్రజల తలరాతలు మారాలి అంటే .. తరగని ఆత్మస్థైర్యం, అన్నిరంగాలకు ఉపాధినిచ్చే ఊతాన్ని అందించాలేకానీ ..ఉచితాలు ప్రకటించి .. ఉన్నదంతా సంక్షోభంలోకి నెట్టడం కాదన్నది ప్రస్తుతం ఏపి ప్రజల వాదన. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు బాగా గుర్తు .. అది డిసెంబర్ 22, 2018 ఆయన ప్రజా సంక(ట)ల్ప యాత్రలో భాగంగా రాష్ట్రమంతా బాగా నటిస్తున్న రోజులవి. ఉత్తరాంధ్రలోని టెక్కలి బహిరంగ సభలో బాదుడే.. బాదుడు అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాడు జగన్ రెడ్డి వాడిన బాదుడే .. బాదుడు అన్న అద్దె స్క్రిప్ట్ డైలాగ్స్ బాగానే రక్తి కట్టాయి. తదననంతరం ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత బాదే బాదుడుకి రక్తం కక్కుకు చచ్చే పరిస్థితి దాపురించింది’అని ప్రజలు వాపోతున్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని పట్టుకుని బాదుడే బాదుడు అన్న జగన్ .. నేడు అన్నిట ధరలను అమాంతం పెంచి భరించలేనంతగా బాధకు గురిచేస్తున్నాడు. దీనిని ఓపికగా ఇక భరించేది లేదు అని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటిపన్నులు, స్కూల్ ఫీజులు ఇలా చెప్పుకుంటూ .. బాదుడే బాదుడు అని ఆనాడు ఎంతో జెంటిల్మెన్ రాజకీయాలను వలకపోసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మీరు చేసేదేమిటని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలను కంపేర్ చేస్తూ ఒంటెద్దుపొకడను కడిగి పారేశాడు. జగన్ రెడ్డి 25 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ట్రూఆఫ్ చార్జీలతో విద్యుత్ బిల్లలను రెట్టింపు చేశారు. ఇంటిపన్ను పెంపు, ఆఖరికి చెత్తపై కూడా పన్నువేసి ప్రజల వెన్ను విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దౌర్భాగ్యపు ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా వ్యాట్ ను కూడా తక్షణమే తగ్గించాలని బీజేపీ, జనసేన, వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం బాదేసి వదిలేసినా.. మీరు బాధిస్తునే ఉన్నారుగా?
కేంద్రం పెట్రోలు, డీజిల్ పై ఇబ్బడిముబ్బడిగా బాదేసి వదిలేశారు. పెట్రోల్ పై రూ.5, డీజిల్ రూ.10 మేరకు తగ్గించి ఉపశమనం కల్పిస్తే .. కేంద్రం తగ్గించిన వ్యాట్ కు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు వ్యాట్ లో కోతలు విదిస్తూ ధరలను అదనంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అన్నిరాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా .. ఏపిలో మాత్రం పైసాకూడా తగ్గించలేదు.అలా చేయకపోగా .. సమాచారశాఖ ద్వారా కోట్లు ఖర్చు చేసి ఎందుకు తగ్గించలేకపోతున్నామో ఒక ముష్టి రాజకీయ ప్రకటన ఇచ్చారు. అధికారం ఉంది కదా అని ప్రజాధనాన్ని జవాబుదారీతనం లేకుండా ఖర్చుచేసే మీకు ప్రజల పడుతున్న ఇబ్బందులు ఏం తెలుస్తాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పై ధరలను తక్షణమే తగ్గించాలని దండయాత్రను ప్రారంభించాయి. దీనిపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కాషాయ శ్రేణులను ఆందోళనలకు పిలుపిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా మన కన్న తక్కువ ధర వసూళ్లు చేస్తుంటే జగన్ రెడ్డి ఇకనైనా కళ్ళు తెరవవా? అని ప్రశ్నించారు. పెట్రోల్ బంకుల వద్ద నిరసనకు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై 17 చొప్పున పన్నులు తగ్గించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చాడు.
Must Read ;- ఏపీ నాశనికి .. నాలుగేళ్లు!











