వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలకు వరుస షాకులు తప్పడం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ రికార్డు విక్టరీ సాధించగా.. ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్.. అసెంబ్లీలో తన పార్టీకి ఉన్న బలంతో తనదైన శైలి నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తానని, రాజన్న రాజ్యం తీసుకువస్తానని నమ్మబలికిన జగన్.. అధికారం చేతికి అందగానే.. ఎన్నికల్లో తాను ఇచ్చిన వాగ్దానాలను మరిచిన జగన్.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై జనం ఓ రేంజిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నా కూడా జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే విద్యుత్ చార్జీలను రెండింతలు, మూడింతల మేర పెంచేసిన జగన్.. పెరిగిన విద్యుత్ చార్జీలను జనం ముక్కు పిండి మరీ వసూలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో ఏడాది తిరగకుండానే జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న జగన్.. ఆ తర్వాత కూడా తనదైన శైలి నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నారు.
ఇక కోతలు షురూ
ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలను భరించలేక ఏపీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సరే.. విద్యుత్ చార్జీలు పెంచితే పెంచారు గానీ.. నాణ్యమైన విద్యుత్ అయినా దక్కుతుందిలే అన్న దిశగా కొందరు భావించారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేకుండా జగన్ సర్కారు.. ఏపీలో విద్యుత్ కోతలకు కూడా శ్రీకారం చుట్టేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అనధికారిక విద్యుత్ కోతలను అమల్లోకి తెచ్చేసిన జగన్ సర్కారు.. తాజాగా ఆ కోతలను అధికారికం చేసేందుకు సిద్ధపడిపోయింది. ఈ మేరకు సోమవారం మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడిందని, అందుకనుగుణంగానే విద్యుత్ కోతల దిశగా అడుగు వేయక తప్పడం లేదని సజ్జల ప్రకటించారు. ఈ సందర్భంగా సజ్జల సుదీర్ఘ వివరణ ఇస్తూ.. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలపై తనదైన శైలి విశ్లేషణ చేశారు.
అంతర్జాతీయ సమస్యే కారణమట
రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కారణాలను ఏకరువు పెట్టిన సజ్జల.. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు కొరతే మొత్తం సమస్యకు కారణమని చెప్పారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుదుత్పత్తి కర్మాగారాలతో పాటు దేశంలోని అన్ని కర్మాగారాలకు బొగ్గు కొరత ఉందని, దీంతో ఒక్కసారిగా విద్యుదుత్పత్తి పడిపోయిందని ఆయన వివరించారు. మరో అడుగు ముందుకేసిన సజ్జల.. ఏపీలోని విద్యుత్ కోతలకు అంతర్జాతీయ సమస్యే కారణమంటూ కూడా సరికొత్త వాదన వినిపించారు. అంతర్జాతీయంగా బొగ్గు కొరత ఉందని, దీంతోనే ఏపీలో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోయిందని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ కోతలు తప్పడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. మొత్తంగా ఏపీలో త్వరలోనే మొదలుకానున్న అధికారిక విద్యుత్ కోతలకు అంతర్జాతీయ సమస్య కారణమని చెప్పిన సజ్జల కామెంట్లపై సెటైర్లు పడిపోతున్నాయి.
Must Read ;- నిన్న ఆర్థికం.. నేడు విద్యుత్










