తెలుగు సినిమా కథపై పరుచూరి బ్రదర్స్ ఎంతో ప్రభావం చూపారు .. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశారు. ఎంతోమంది స్టార్ హీరోలు సాధించిన విజయాల్లో పరుచూరి బ్రదర్స్ పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలైన ‘ఖైదీ’ .. ‘సంఘర్షణ’ .. ‘దొంగ’ .. ‘అడవి దొంగ’ .. ‘కొండవీటి దొంగ’ .. ‘కొండవీటి రాజా’ .. ‘ముఠామేస్త్రి’ .. ‘గ్యాంగ్ లీడర్’ .. ‘ ఘరానా మొగుడు’ .. ‘ఇంద్ర’ .. ‘ఠాగూర్’ మొదలైన సినిమాలకి పరుచూరి బ్రదర్స్ పనిచేశారు. అందువలన చిరంజీవి నుంచి ఆయన అభిమానులు ఎలాంటి కథలను ఆశిస్తారు .. ఆయనను ఎలా చూడాలనుకుంటారు అనేది వారికి బాగా తెలుసు. తాజాగా ‘పరుచూరి పలుకులు’లో చిరంజీవి .. బన్నీ సినిమాలను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.
*’మెకానిక్ అల్లుడు’ సినిమాను మాతో రాయించుకోవడానికి అల్లు అరవింద్ గారు వచ్చారు. ఆ కథ నాకు నచ్చలేదు అని చెప్పాను. అప్పుడు అల్లు అరవింద్ గారు “ఇన్నాళ్లుగా మా నాన్న నన్ను తిడుతున్నాడు .. పరుచూరివాళ్లతో రాయించుకోమనీ, నేను కథ తీసుకొస్తే మీరేమో నచ్చడం లేదని చెబుతున్నారు” అన్నాడు. అక్కడి నుంచే దర్శకుడు బి. గోపాల్ కి కాల్ చేశారు. ఆయన కూడా ఈ సినిమాకి రాయమని అడిగాడు.
*చిరంజీవిగారికి సంబంధించినంత వరకూ మాకు నచ్చలేదని చెప్పిన కథలన్నీ పోయాయి. అందువలన ఈ సినిమా మేము చేయలేము అని తప్పుకోవడం జరిగింది. అలా అల్లు అరవింద్ నిర్మాణంలో అవకాశం వచ్చినా చేయలేకపోయాము.
*ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా చిన్నికృష్ణ సిద్ధం చేసిన కథతో ‘బద్రీనాథ్’ సినిమా చేయవలసి వచ్చింది. ఆ సినిమాకి సంబంధించిన కథా చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఆ సమయంలోనే మేము ఒక ముఖ్యమైన పనిమీద అమెరికా వెళ్లవలసి వచ్చింది.
*ఆ విషయాన్ని అల్లు అరవింద్ గారికి చెప్పాను. ‘మీరు తిరిగి వచ్చేవరకూ ఇక్కడ ఏమీ జరగదులెండి .. వెళ్లిరండి, ఇది ఇప్పట్లో పూర్తయ్యే కథ కాదు’ అన్నారు. ఆ తరువాత వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘బద్రీనాథ్’ వచ్చింది .. కాకపోతే అందులో మా పాత్రలేదు. అప్పుడు నేను నవ్వి .. “ఏమీ జరగదులెండి అన్నారు .. కానీ అన్నీ జరిగిపోయాయండీ .. మళ్లీ మా చేతుల్లో నుంచి ‘బద్రీనాథ్’ కూడా వెళ్లిపోయింది” అని అల్లు అరవింద్ గారితో అన్నాను. అలా బన్నీ సినిమాను కూడా చేయలేకపోయాము అని చెప్పుకొచ్చారు.
Must Read ;- అల్లు అరవింద్ రూట్లో మీడియా దిగ్గజం రామోజీరావు