హైదరాబాద్ వరదలు అటు జనానికి ఇటు ప్రభుత్వానికి భలే తిప్పలు తెచ్చిపెట్టాయి. వరద సాయం అందించడంలో అవకతవకలు జరిగాయని, నిజమైన అర్హులకు సాయం అందలేదనే విపక్షాల ఆరోపణల నడుమ వరద సాయం అందని వారికి మరోక వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ దీపావళి రోజు ప్రకటించారు. దీంతో వరద సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వరద బాధితులు మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో క్యూ కట్టారు.
Must Read: హరీష్-కేటీఆర్ మధ్య తగువు పెట్టాలనుకుంటున్న హీరోయిన్!
ముషీరాబాద్, రాంనగర్ మరికొన్ని ప్రాంతాల్లోని మీసేవా కేంద్రాల వద్ద వరద సాయం రూ.10వేల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనం బారులు తీరారు. రాంనగర్లోని మీ సేవా సెంటర్ ఇంకా తెరుచుకోక ముందే ఉదయం ఆరు గంటల నుంచే దరఖాస్తు కోసం పడిగాపులుకాచారు. ఒక పక్క కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా నగరంలో తగ్గకముందే జనం ఇలా సెంటర్ల ముందు దరఖాస్తుల కోసం బారులు తీరడం కొత్త సమస్యకు దారితీస్తోంది. మరో పక్క కొన్ని మీసేవా సెంటర్ల నిర్వాహకులు రూ.20 తీసుకునే దరఖాస్తు ఫీజును రూ.120 వరక వసూలు చేస్తున్నారనే ఆరోపణలు జనం నుంచి వినబడుతున్నాయి. అప్లికేషన్ పేరుతో దోచుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్లికేషన్కు రూ.20 అవుతాయన్న కేటీఆర్ మాటలను మీ సేవా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అలాగే ఈ సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే వరదలతో నిండా మునిగిన తమకు ఇలా దరఖాస్తు నమోదు పేరుతో డబ్బులు దండుకోవడం చాలా దారుణమని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు వరద సాయం పేరుతో రాజకీయం చేస్తున్నారని విపక్షపార్టీ నేతలు ఆరోపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే వరద సాయం అందని వారికి మళ్లీ అందించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.