భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ సంచలన పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై త్వరితగతిన విచారణ జరిగితే… క్విడ్ ప్రోకో కింద కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది. అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న రాజకీయ నేతలపై నమోదైన కేసులను త్వరితగతిన విచారణ చేయడంతో పాటుగా ఈ కేసుల్లో బెయిల్పై బయట ఉన్న నేతల బెయిల్ను ఎందుకు రద్దు చేయకూడదన్న వాదనతో ఈ పిల్ దాఖలైంది. ఏపీకి చెందిన యూత్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. పిటిషన్లో భారీ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న పలువురు నేతలతో పాటు సీఎం జగన్ పేరును కూడా ప్రతివాదిగా చేర్చింది.
కీలక అంశం ప్రస్తావన
ఈ పిటిషన్ అతి సాధారణమైనదిగానే కనిపిస్తున్నా… అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఐదేళ్లకు పైగా బెయిల్పై ఉన్న నేతల బెయిళ్లను రద్దు చేయాలని కోరుతూ యూత్ ఫర్ ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. అంటే… కేసులు ఎన్ని నమోదు అయినా ఆయా కేసుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఏకంగా ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తున్న నేతల కారణంగా ఆయా కేసుల విచారణ ప్రభావితం అవుతుంది కదా అంటూ పిటిషనర్ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అవినీతికి పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే ప్రభుత్వ పాలనకు నేతృత్వం వహిస్తుంటే… ఇక ఆయా కేసులు తేలేది ఎప్పుడు? ఆయా కేసుల విచారణ ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా పూర్తి అయ్యేదెలా? అన్న అంశాలను కూడా పిటిషనర్ ప్రస్తావించారు. మొత్తంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కేసులు నమోదైన నేతలు జైలు బయట ఉండరాదన్న వాదనను పిటిషనర్ వినిపించారు.
ఈ వాదన సహేతుకంగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అవినీతి అక్రమాలకు సంబంధించి కేసులు నమోదైనా ఎంచక్కా బెయిల్ తీసుకుని జైలు బయటకు రావడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ పాలనకు నేతృత్వం వహిస్తున్న జగన్ లాంటి నేతల బెయిళ్లను రద్దు చేయాల్సిందేనని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అంతేకాకుండా బెయిల్పై ఐదేళ్లకు పైబడి ఉంటున్న నేతల బెయిళ్లను రద్దు చేయాలన్న డిమాండ్ను పిటిషనర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ పిటిషన్పై విచారణ జరిగితే.. ఏ క్షణంలో అయినా జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం.. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో?
Also Read: పల్నాడు పాయే, పరిటాల పాయే; అన్నింటికీ వైఎస్ పేరే