వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు సీఎం జగ్మోహన్రెడ్డికి లేఖల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ గత నాలుగు రోజులుగా ఎంపీ రఘురామరాజు సీఎం జగన్కు లేఖలు రాస్తున్నారు. ఇవాళ కూడా ఒక లేఖ సంధించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడచిపోయినా ఇంత వరకు ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయలేదని ఎంపీ రఘురామరాజు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి లక్షలాది మంది నిరుద్యోగులు ఓట్లు వేశారని, వారంతా ఇప్పుడు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన లేఖలో వివరించారు. ఇప్పటికైనా వెంటనే ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలన్నారు.
ఏ శాఖలో ఎన్ని ఖాళీలు?
ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డాయో కూడా రఘురామరాజు లేఖలో వివరించారు. 6 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, 30 వేల టీచర్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని ఎంపీ రఘురామరాజు లేఖలో గుర్తు చేశారు. ఇక గ్రామ, వార్డు కార్యాలయాల్లో 8 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని, యూనివర్శిటీల్లో సగం సిబ్బంది కొరత ఉందని ఆయన రాసిన లేఖలో వివరించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని రఘురామరాజు లేఖలో విజ్ఙప్తి చేశారు.
Must Read ;- ఏ పార్టీతోనూ జతకట్ట లేదు.. అనర్హతకు అవకాశం లేదు : రఘురామరాజు