తనను అన్యాయంగా యాజమాన్యం నుంచి తొలగించిన వ్యక్తులు తన పాస్పోర్టును కూడా తీసుకోనివ్వలేదని, కొత్త పాస్పోర్టు జారీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో టీవీ9 సీఈఓగా పనిచేసిన రవిప్రకాశ్కి, కొత్త యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో కొత్త యాజమాన్యం రవిప్రకాశ్పై కేసులు పెట్టింది. ఈ కేసుల్లో రవిప్రకాశ్ జైలుకు కూడా వెళ్లారు. కాగా మరికొన్ని ఇష్యూల్లో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించి 2019 జూలై 12న షరతులతో కూడిన బెయిల్ ఉత్తర్వులు పొందారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రవిప్రకాశ్ తన పాస్ పోర్టును దిగువ న్యాయస్థానానికి అప్పజెప్పాలి. మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. అయితే తన పాస్పోర్టు ప్రస్తుతం కనిపించడం లేదని, తమ చేతికి రాగానే.. న్యాయస్థానానికి అప్పజెబుతానని రవిప్రకాశ్ తరఫు న్యాయవాదులు గతంలో న్యాయస్థానానికి చెప్పారు. ఇప్పటి వరకు రవిప్రకాశ్ తన పాస్పోర్టును న్యాయస్థానానికి స్వాధీనం చేయలేదు. దీంతో చట్టప్రకారం ఇబ్బందులు ఎదురుకానున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు రవిప్రకాశ్. హైకోర్టులో రవిప్రకాశ్ తరఫు వాదనల ప్రకారం.. ‘తనను అన్యాయంగా డైరక్టర్ పదవి నుంచి తొలగించారు. ఛాంబర్ లోకి కూడా వెళ్లనివ్వలేదని, ఛాంబర్లో విలువైన పత్రాలు, కొంత నగదు, పాస్పోర్టు ఉండిపోయాయి’ అని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. బెయిల్ నిబంధనల ప్రకారం తాను పాస్పోర్టును దిగువ న్యాయస్థానానికి స్వాధీనం చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తనకు మరో పాస్పోర్టు జారీ చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచించారు.
‘పాస్పోర్టును అక్రమంగా వారి ఆధీనంలో ఉంచుకున్నారు’
ఇదే క్రమంలో రవి ప్రకాశ్ మరికొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. తన క్లయింట్ పాస్ పోర్టును అక్రమంగా కొందరు వారి ఆధీనంలో అటిపెట్టుకున్నారని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది ప్రద్యుమ్నకుమార్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. తన క్లయింట్ రవిప్రకాశ్ కుమార్తె అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైందని, ఇప్పుడు ఆమెకు ఆయన సహాయం అవసరమని, చూసేందుకు వెళ్లాల్సి ఉందని రవిప్రకాశ్ న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న న్యాయస్థానం షరతు విధించిన విషయం తెలిసిందే. అయితే, అత్యవసర సమంయలో పూచీకత్తుపై విదేశాలకు వెళ్లే అవకాశాన్ని న్యాయస్థానాలు పరిశీలిస్తాయి. ఈ నేపథ్యంలో తన కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురైందని, ఆమెను చూసేందుకు వెళ్లాలంటే పాస్పోర్టు కావాలని, పాత పాస్పోర్టు తన స్వాధీనంలో లేదని, కొత్త పాస్పోర్టు జారీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విషయంపై న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. పాస్పోర్టును అక్రమంగా తమ వద్ద ఉంచుకోవడం లాంటి చర్యలు సరి కాదని, ఒక కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు ఇలాంటి నీచమైన పని చేయాలా అని వ్యాఖ్యానించినట్టు కొన్ని వెబ్ సైట్లు కథనంలో పేర్కొన్నాయి. కాగా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Must Read ;- టీవీ నైన్ రవిప్రకాష్కు మళ్లీ పూర్వ వైభవం..?











