జర్నలిస్ట్ రవి ప్రకాష్ అనేకంటే.. తెలుగు మీడియాలో గతంలో ఓ వెలుగు వెలిగిన, సంచలన వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా ఛానెల్ ను తీర్చిదిద్దిన టీవీ నైన్ రవిప్రకాష్ అంటే అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన రాజ్ న్యూస్ తో పాటు మూడునాలుగు ఛానెళ్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ ఛానెళ్లలో ఆయన వాటాలు ఎన్ని.. అసలు ఎలాంటి ఒప్పందాలు జరిగాయనేది ఇంకా బయటకు రాలేదు. కాగా ఆయన నిర్వహిస్తున్న ఛానెళ్లలో ఒకటైన రాజ్ న్యూస్ తెలుగున్యూస్ ఛానెల్ ప్రసారం చేస్తున్న వార్తలను పరిశీలిస్తే.. పూర్తిగా కాషాయమయమైందని చెప్పవచ్చు. ఇక తాజాగా జరుగుతున్న చర్చ, రవిప్రకాశ్ అభిమానులు చెబుతున్న ప్రకారం రవిప్రకాష్ కు మళ్లీ పూర్వ వైభవం రానుందని తెలుస్తోంది. ఒకటిరెండు వెబ్ సైట్లు కూడా ఆ అవకాశాలను విశ్లేషించాయి. అది ఎలా సాధ్యమనే అంశానికివ వస్తే రాజీ ఫార్ములా తెరపైకి వచ్చిందని, రాజకీయాల్లో పవర్ ఉన్నప్పుడు రాజీ పెద్ద కష్టం కాదని, కొన్ని చట్టపరమైన అంశాలు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివాదం తరువాత..
దాదాపు రెండేళ్ల క్రితం టీవీ నైన్ యాజమాన్యం మారింది. ఈ లావాదేవీల్లో వివాదం తలెత్తింది. దీంతో టీవీ9నుంచి బయటకు వచ్చిన రవిప్రకాష్ పై పలు కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లపాటు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. తరువాత రవిప్రకాష్ పలురకాల ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులనేపథ్యంలో అది సాధ్యం కాలేదు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్ కు కేంద్ర స్థాయిలో కీలకంగా ఉన్న రెండుపార్టీనుంచి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజ్ న్యూస్ తెలుగులో రవిప్రకాశ్ ఎంట్రీ జరిగిందని చెబుతున్నారు. కర్ణాటకలోనూ రవిప్రకాశ్ ఓ ఛానెల్ పర్యవేక్షణ చూసుకుంటున్నారని చెబుతున్నారు. మీడియాలో ఆధిపత్యం చలాయిస్తున్న రోజుల్లో ఉన్న సంబంధాలతో డిల్లీలో కీలక వ్యక్తులతో భేటీలు జరిగాయని, ఈ నేపథ్యంలో తనకు ఇంత పేరు తెచ్చిన ఛానెల్ ని పశ్చిమబెంగాల్ లో లాంఛ్ చేసేలా చేశారని తెలుస్తోంది. అదే సమయంలో వ్యాపార, పారిశ్రామిక వర్గాలపైనా బీజేపీ కన్నేసిందని, వారి కార్యకలాపాల్లో లోపాలను బీజేపీ పసిగట్టిందని చెబుతున్నారు. ఆ మధ్య ఐటీ, ఈడీలు కూడా వచ్చి వెళ్లాయని ప్రచారం జరుగుతోంది. తమను కాదంటే..రానున్న కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. ఈ ఐటీ, ఈడీల జోక్యం శాంపిల్ గా మాత్రమే సదరు ధిల్లీ పెద్దలు చూపించారని, ఇవన్నీ పసిగట్టాకే ‘ముఖ్య’నేత డిల్లీ టూర్ కూడా పూర్తయిందని, మాటతీరులో చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. అంటే పరోక్షంగా డిల్లీ పెద్దలు ఇక్కడి పెద్దలకు పరోక్షంగా హెచ్చరికలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గత వైరం సమసిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో రవిప్రకాశ్ సదరు ధిల్లీ పెద్దల చేతిలో అస్త్రంగా ఉండడం కంటే.. రాజకీయంగా రానున్న కాలంలో తమ అవసరాలున్న నేపథ్యంలో తమ కోటరీలోనే ఉండడం బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే.. రవిప్రకాష్ కు పూర్వవైభవం రానుందని ప్రచారం జరుగుతోంది.
Must Read ;- మీడియా స్వేచ్ఛకు ఉరి.. చర్యలు తీసుకోండి











