ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో, సెకండ్ వేవ్ ప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఏపీలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. నగరాల్లో మల్టీఫెక్సుల్లో సినిమా షోలు కూడా ప్రారంభించారు. దీంతో జనం గుంపులుగా చేరుతున్నారు. దీంతో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తిని మాత్రం తగ్గించలేకపోతున్నారు. తాజాగా పాఠశాలల ప్రారంభంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కోవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రకాశంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు
ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలు ప్రారంభించడంతో జిల్లాలో నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం పెదగొళ్లపల్లి పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, త్రిపురాంతకం హైస్కూల్లో ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తిని నియంత్రించలేకపోతున్నారు. తాజాగా పాఠశాలలు, మల్టీఫ్లెక్సులు కూడా తెరవడంతో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం అవుతోందని డాక్టర్లు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో 40వేలుదాటిన కరోనా కేసులు
కృష్ణా జిల్లాలో కరోనా అదుపులోకి రావడం లేదు. పాఠశాలలు ప్రారంభంతో ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు కరోనా భయంతో వణికి పోతున్నారు. తాజాగా విజయవాడలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
తొందరపాటు నిర్ణయమా?
ఏపీ ప్రభుత్వం పాఠశాలలు తెరవడం తొందరపాటు నిర్ణయంగా విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. రెండు నెలల పాటు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించినా, ఏపీలో ప్రయివేటు పాఠశాలలు మాత్రం ఆన్ లైన్లోనే నడుస్తున్నాయి. చాలా పాఠశాలల్లో సామాజిక దూరం పాటించడానికి అవసరమైన స్థలం, తరగతి గదులు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించినా సగం మంది విద్యార్థులు కూడా హాజరుకాకపోవడంపై అధికారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా ఆకులగణవరంలో ఇద్దరు విద్యార్థులకు కరోనా
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఆకులగణవరం ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా విద్యార్థులు కోవిడ్ భయంతో హాజరుకాకపోవడంపై జిల్లా విద్యాధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
నిలిచిపోయిన హైమాస్క్ బస్సులు
కరోనా టెస్టుల శాంపిళ్లను సేకరించేందుకు ఏపీలో 24 హైమాస్క్ బస్సులను ప్రభుత్వం ప్రారంభించింది. సిబ్బంది ఆరు నెలలుగా ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది కరోనా శాంపిళ్లను తీసుకున్నా వారికి మాత్రం ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. హైమాస్క్ బస్సుల్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు సేవలు నిలిపి వేశారు. దీంతో ఏపీలో నేటి నుంచి హైమాస్క్ బస్సుల వద్ద కరోనా టెస్టు శాంపిళ్ల సేకరణ నిలిచిపోయింది.