Rice ATM Started By Dosapati Ramu For Poor People :
కరోనా మహమ్మారి ఎంతోమంది పేదలను, వలస కూలీల బతుకులను ఆగం చేసింది. ఉపాధి కోల్పోయి పస్తులుండే పరిస్థితులు కల్పించింది. ఫలితంగా ఒక్క పూట భోజనం లేక అల్లాడిపోయారు. వాళ్లందరీ బాధలను దగ్గరగా చూశాడు హైదరాబాద్ కు చెందిన దోసపాటి రాము. తన సంపాదనలో సగం డబ్బులు ఖర్చుచేస్తూ… పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నాడు. కేవలం పేదల కోసమే ‘రైస్ ఏటీఎం’ ను ప్రారంభించి.. హైదరాబాద్ లోని ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నాడు.
అందుకే సోషల్ వర్క్
దోసపాటి రాముది నల్లగొండ జిల్లా. వ్యవసాయ కుటుంబం. రైతులు, కూలీల సమస్యలు ఎలా ఉంటాయో చిన్నప్పుడే తెలుసుకున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు వ్యవసాయ పనులు చేసేవాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఓ రోజు ఇంటికి సమీపంలో అనాథ పిల్లాడు ఆకలిని భరించలేక సాయం చేయాలని అందర్నీ బతిమిలాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో చెత్త బుట్టలో పడేసిన పండ్లు తిన్నాడు. ఆ సంఘటనకు రాము చలించిపోయాడు. అదే సమయంలో ఓ మహిళ నిరంతరాయంగా పేదలకు సాయం చేస్తుండటంతో రాము మనసు సోషల్ వర్క్ వైపు వెళ్లింది. అప్పట్నుంచే తనకు వచ్చిన దాంట్లో సగం డబ్బులు పేదలకు ఖర్చు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కూలీలు, వలస కార్మికులు, అనాథలు, భిక్షాటన చేసేవాళ్లకు సాయం చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోవడంతో.. అలాంటివాళ్ల కోసం రైస్ ఎటీఎం ప్రారంభించాడు.
28 వేల మందికి సాయం
ఉపాధి కరువై డబ్బు లేక, తినేందుకు తిండి లేక దేశంలో కోట్లాది మంది ఆకలితో అలమటించారు. లక్షలాది మంది వలస కార్మికులు కాలిబాటన వందల కిలోమీటర్లు నడిచి దారుణమైన కష్టాలను ఎదుర్కొన్నారు. ఇవన్నీ చూసి మానవతావాదులు స్పదించడం మొదలుపెట్టారు. అలాంటివాళ్లలో ఒకడు ఈ దోసపాటి రాము. లాక్డౌన్లో ప్రజల కష్టాలు చూడలేక రైస్ ఏటీఎం ద్వారా 28వేల మందికి సాయం చేశారు. బియ్యం, సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. 24×7 గంటలు పని చేసేలా రైస్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 325 రోజులు పూర్తయ్యాయి. ఏ ఒక్క రోజు కూడా బియ్యం, సరుకుల పంపిణీ ఆపలేదు. ఇందుకు కొన్ని లక్షలు ఖర్చు చేశారీయన. దోసపాటి రాము సేవలను ప్రత్యక్షంగా పొందిన పేదలు ‘మనుషుల్లో మహాత్ముడు’ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు.
Must Read ;- కూలీ కొడుకు.. సెయిలింగ్ లో సత్తా చాటాడు!











