హైకోర్టు ఇస్తున్న తీర్పులు, ఆదేశాల అమలులో సర్కారు నిర్లక్ష్యం అధికారులకు చుట్టుకుంటోంది. భూనిర్వాసితులు, ఇతర కేసుల్లో న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన బాధితులకు అనుకూలంగా వచ్చిన తీర్పులను ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీంతో సంబంధిత అదికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నారు. పలు కేసుల్లో కొందరు ఐఏఎస్ అధికారులు,ఇతర అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా కూడ విధించింది, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం.. మంత్రులు,ఇతర పెద్దల నుంచి వచ్చే ఒత్తిళ్లతో కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు అమలు చేయలేకపోతున్నామని, దీంతో తాము బలవుతున్నామని శిక్షకు గురైన అధికారులు ఆవేదన చెందుతున్నారు.
సీఎస్పైనే 290 కేసులు
తెలంగాణ ఉన్నతాధికారైన సీఎస్ సోమేశ్కుమార్పై రాష్ట్రంలోనే అత్యధికంగా హైకోర్టులో 290 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్లు, సెక్రటరీలు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపైన కూడ వందల్లో కేసులు ఉన్నాయి. సీఎస్పై నమోదైన 290 కేసుల్లో 100 వరకు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పటివి కాగా మిగతావి చీప్ కమిషనర్ ఆప్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఎ), సీఎస్గా పని చేసిన కాలంలో ఫైల్ అయినవే.ఈ ఏడాది ఐదు నెలల్లోనే 38 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఆయనపై నమోదయిన కేసుల్లో వాదించడానికి, జరిమానాలు కట్టేందుకు ప్రభుత్వం సీసీఎల్ఏకు గతంలో ఎన్నాడూ లేనివిధంగా ఇటీవల రూ.58.95 కోట్లు విడుదల చేసింది.
హైకోర్టును ఆశ్రయిస్తేనే..
ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా న్యాయం జరగకపోవడంతో బాధితుల హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారు, కరోనాను కట్టడి చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ నుంచి కాపాడాలంటూ ఇలా బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆయా కేసుల్లో బాధితులకు అనుకూలంగా తీర్పులు వస్తున్నా అమలు చేయకపోవడంతో అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయి.
బలవుతున్న ఐఏఎస్లు
కోర్టు ధిక్కరణ కేసుల్లో సీఎస్పై హైకోర్టు అనేక సందర్భాల్లో సీరియస్ అయ్యింది. అంతేగాక ఈ ఏడాది నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత జీవన్ పాటిల్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, భూ సేకరణ అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో జయచంద్రారెడ్డిలకు కోర్టు జైలు శిక్షలు విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయకపోవడం వలనే వీరు శిక్షకు గురయ్యారు.
ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి..
సీఎస్ సోమేశ్కుమార్పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల వివరాలివ్వాలంటూ హైకోర్టు అడ్వకేట్ మోహన్లాల్ అడ్వకేట్ జనరల్ ఆఫీసులో ఆర్టీఐ ధరఖాస్తు చేశారు. తొలుత తమ ఆఫీను పబ్లిక్ అథారిటీ కాదని ఆ చట్ట పరిధిలోకి తెలపగా, మోహన్లాల్ ఆర్టీఐ పరిధిలోకి ఈ ఆఫీసు ఎలా వస్తుందో తెలపడంతో వివరాలు ఇచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్న సీఎస్ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడని. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మోహన్లాల్ అన్నారు.
Must Read ;- జగనొచ్చాడు.. ఐఏఎస్లు జైలుకెళుతున్నారు











