ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, “చాలా కాలం తర్వాత తిరిగి థియేటర్లు మొదలవుతుండటం చాలా చాలా సంతోషంగా ఉంది. థియేటర్ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అలాగే ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు రావాలి. ఇక ఈ బ్యానర్లో నేను చేసిన మొదటి చిత్రమిది. దర్శకుడు సుబ్బు కథను ఎంత కసిగా చెప్పారో.. చిత్రాన్ని అంత బాగా తీశారు. ఎమోషన్స్ మిళితమైన చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్ ఇది. నాకు మంచి స్నేహితుడైన తమన్ ఈ చిత్రానికి కూడా వీనుల విందైన సంగీతాన్ని అందించారు. నాలుగు పాటలకు నాలుగు హైలైట్.” అని అన్నారు. సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, “మా అందరికీ అన్నం పెట్టినవి, మమ్మల్ని ఇంతవాళ్లను చేసింది థియేటర్లే. దాదాపు ఆరేడు నెలలు తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్నాయి. దీంతో సినీ రంగానికి మళ్లీ పూర్వ వైభవం తప్పకుండా వస్తుంది. హీరో సాయిధరమ్ ఈ చిత్రంలోని పాత్రకు కచ్చితంగా సరిపోయారు. ఈ బ్యానర్ లో సినిమాలు చేసిన దర్శకులంతా నా అభిమానులే” అని అన్నారు.
నటుడు రావురమేష్ మాట్లాడుతూ, “ సోలో బ్రతుకే సో బెటర్ అని చాలా మంది అనుకుంటుంటారు. ఒకప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ మా అమ్మ వల్ల ఓ ఇంటి వాడినయ్యాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరింపజేస్తుంది” అని చెప్పారు. దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ, ఈ చిత్రకథ సాయిధరమ్ తేజ్ ను ఎంతో ఆకట్టుకోవడంతో నటించేందుకు ఒప్పుకున్నారు. చిత్రీకరణలో నాకెంతో సపోర్ట్ గా నిలిచి, చిత్రం ఎంతో బాగా రావడానికి కారణమయ్యారు. నిర్మాతతో పాటు యూనిట్ సహకారం మరువలేనిది” అని అన్నారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ, “మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నాం. థియేటర్లు మూతపడిన కారణంగా ఒక దశలో ఓటీటీలో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నాం. కానీ థియేటర్లు ఓపెన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులు లభించడంతో ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు జీ సంస్థ ఎంతో సహకరించింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయితలు కాసర్ల శ్యామ్, రఘు, జీ సంస్థకు చెందిన నీరజ్ జోషి తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- బాలయ్యతో సి.కళ్యాణ్ సినిమా.. దర్శకుడు ఎవరు..?