బాల సాహిత్యానికి వెన్నెముక కలవకొలును సదానంద కన్నుమూశారు. వృద్ధాప్యమే అయినా సదానంద లేకపోవడమంటే బాల్యం కన్నీరు మున్నీరు కావడమే. ఎంత సాహిత్యం… ఎన్ని కథలు, ఎన్ని నీతులు, ఎన్ని దిశానిర్దేశాలు. అవన్నీ తెలుగు పాఠకులకు మిగిల్చి కలవకొలను సదానంద భౌతికంగా వెళ్లిపోయారు. రచయితకి వయసుతో పని లేదని, భాషపై పట్టు, కథ అల్లికలో నేర్పు ఉంటే చాలునని తన 18 వ ఏటనే నిరూపించారు కలవకొలను సదానంద.
ఎలా అంటారా? ఆ వయసులో ఓ కథ రాసి. చందమామ, బాలమిత్ర, బాలరంజని, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బాలభారతి, బుజ్జాయిలాంటి చిన్నారుల పత్రికలలో అసంఖ్యాకంగా రచనలు చేశారు సదానంద. “కలవకొలను వారిది చిన్న పిల్లల మనసు. అందుకే వారు కథలు అంత అద్భుతంగా రాశారు. కథకులు సాదారణంగా తెలివైన వారే అవుతారు. చిన్నపిల్లల్లా మాత్రం కారు. అలా మారితేనే పిల్లల కథలు రాయవచ్చు“ అని మహా రచయిత రా.వి.శాస్త్రి కథకుడు సదానంద గురించి రాసిన నాలుగు అక్షరాలు అక్షర సత్యాలని తెలుస్తుంది.
ఆంధ్రప్రభ, ఆంద్రజ్యోతి, ఆంధ్రభూమి, ఈనాడు వంటి పత్రికల్లో సదానంద కథలు అనేకానేకం వచ్చాయి. ఈనాడు పత్రిక ఇప్పటికీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హాయ్…బుజ్జి పేజీలో కలవకొలను సదానంద వందల కథలు రాశారు. “ పిల్లల కథలు రాయాలంటే వారి స్ధాయికి మనం దిగాలి. వారి స్ధాయికి మనం దిగాలంటే చిన్నపిల్లల్లా ఆలోచించాలి. నా కథలకు అదే బలం” అని చెప్పుకున్న కలవకొలను సదానంద రాయలసీమ ఇచ్చిన అద్భుత కథకుల్లో ఒకరు.
కలవుకొలను సదానంద వాసిలోనే కాదు రాశిలో కూడా విస్తృతంగా సాహిత్య సృజన చేశారు. అది కూడా మామూలు స్థాయిలో కాదు. బాలలకోసం 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయ కథలు రాశారు. వీటిని 8 కథా సంపుటాలుగా ప్రచురించారు. 1964లో అంటే… తన 25 వ ఏటనే ‘సాంబయ్య గుర్రం’ మొదటి కథా సంపుటి సాహిత్య తెర మీదకి ఆవిష్కరించారు. ఈ వయసులో ఇదే ఒక రికార్డు అనుకుంటే ఆ సంవత్సరమే మరో కథా సంపుటి ‘చల్లనితల్లి” విడుదల చేశారు. ఇది పిల్లల మీద ఆయనకు ఉన్న మమకారానికి తార్కాణం. ఆయన రాసిన నవల ‘బంగారు నడిచిన బాట’కు 1966లో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా అవార్డు ప్రకటించింది. అంటే తన 27వ ఏటే సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్నారు కలవకొలను సదానంద.
1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ “నవ్వే పెదవులు – ఏడ్చేకళ్ళు” కథా సంపుటానికి అవార్డు ఇచ్చింది. తెలుగులో వచ్చిన వంద గొప్పకథలని ఎంపిక చేసిన వేసిన కథా సంపుటి ఆణిమ్యుత్యాలులో కలవకొలను సదానంద కథ “తాత దిగిపోయిన బండి”కి చోటు దక్కింది. మహాభారతంలోని కొన్ని పద్యాల ఆధారంగా రాసిన పిల్లల నవల ‘అడవితల్లి’ 2007లో ప్రచురితమైంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న కలవకొలను సదానంద గుప్పెడు జ్ఞాపకాలను, ఆణిముత్యాల్లాంటి కథల్ని మిగిల్చి వెళ్లిపోయారు. అవునూ… కలవకొలను సదానంద వెళ్లిపోయారా…. కాదు… బాలల పుస్తకాల్లోనూ…. ప్రతి తరం బాల్యంలోనూ చిరునవ్వుతో కనిపిస్తున్నారు. అదిగో సదానంద… కళ్లు పరికించి పుస్తకాలున్న అల్మారా వైపు చూడండి… కనిపించారు కదా…!!