మనకు రేపటి నుంచి తుంగభద్ర నదికి పుష్కరాలు వచ్చాయి. పుష్కరం అనేది నీటితోనూ, కాలంతోనూ ముడిపడిన అంశం. ఒక విధంగా 12 సంవత్సరాల కాలాన్ని పుష్కరం అని కూడా అంటారు.
ఇక నీటి విషయానికి వస్తే నారము అంటే నీరు. నారాయుడు అంటే నీటి నుంచి వచ్చిన వాడు. నీరు లేకుండా జీవం ఆవిర్భవించలేదు.. జీవం మనుగడ సాగించలేదు. గురు గ్రహం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాలు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని రెండు రకాలు. గురువు రాశి ప్రవేశం నుంచి మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాల మీద భిన్నభిప్రాయాలు కూడా ఉంటుంటాయి. ఈ పుష్కరాల వెనక ఓ పురాణ కథ కూడా ఉంది. అది పుష్కరుడి కథ.
మనుషులు చేసే పాపాల వల్ల నదులు బాధ పడుతుంటే పుష్కరుడు అనే పుణ్యపురుషుడు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో పవిత్ర క్షేత్రంగా మారాడని అంటారు. స్వర్గంలో మందాకిని నదిలో ఈ పుష్కర తీర్థం ఉందని అంటారు. పుష్కరుడు ఉండేది అందులోనే. పుష్కరుడికి సంబంధించి వాయు పురాణంలో ఓ కథ ఉంది. పుష్కరుడు సంవత్సరానికి ఒక నది చొప్పున 12 నదులనూ దర్శించుకుంటాడని చెబుతారు. గురుగ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తే దానికి సంబంధించిన నదిని పుష్కరుడు సందర్శిస్తాడు.
అలా వచ్చిన పుష్కరుడకి సప్తరుషులు అతథ్యం ఇస్తారట. పవిత్రమైన గంగానది పుష్కరం రావాలంటే గురు గ్రహం మేష రాశి ప్రవేశం చేయాలి. కన్యా రాశిలోకి గురుడు ప్రవేశించే సమయంలో కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. ప్రస్తుతం గురువు మకర రాశి ప్రవేశం జరుగుతోంది. రేపు మధ్యాహ్నం 01.23 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో ఆ నదికి సమీపం ప్రాంతాలలోని వారు వివాహం లాంటి కార్యక్రమాలు తలపెట్టరు.
పుష్కరుడికి మరో చరిత్ర
పుష్కరుడి ఉనకికి సంబంధించి ఇంకో చరిత్ర కూడా ఉంది. ఇది తుందిలుడు అనే ధర్మాత్ముడి కథ. అతను ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఏం వరం కావాలో కోరకోమంటాడు శివుడు. తనకు ఈశ్వరునిలోనే స్థానం కావాలంటాడు తుందిలుడు. దాంతో శివుడు తనలో ఒకటైన జలంలో అతనికి చోటు కల్పిస్తాడు. అలా సమస్త జీవులనూ పోషించే శక్తి తుందిలుడికి లభిస్తుంది.
పోషించ గలిగే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తుందిలుడు కాస్తా పుష్కరుడు అయ్యాడు. సృష్టిచేయడానికి బ్రహ్మకు నీరు అవసరమవుతుంది. పుష్కరుడి తనకు ఇవ్వ వలసిందిగా బ్రహ్మ ఈశ్వరుడిని అడుగుతాడు. ఆయన అంగీకారంతో బ్రహ్మ కమండలలంలోకి అతను చేరతాడు. సృష్టి కార్యం పూర్తయ్యాక ప్రాణాధారం కోసం నీరు కావాలని గురువు బ్రహ్మను అడుగుతాడు.
బ్రహ్మ అంగీకారం తెలిపినా వెళ్లడానికి పుష్కరుడు ఒప్పుకోడు. చివరికి ఒక ఒప్పందానికి వస్తారు. దాని ప్రకారం గురువు ఒక్కో రాశిలోకి ప్రవేశించే సమయంలో 12 రోజుల పాటు సంబంధిత నదిలో ఉంటానంటాడు. మిగిలిన ఏడాదంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల కాలం పాటు గురువుతో ఉండాలన్న ఒప్పందం జరిగింది. గురువు అధిపతిగా ఉన్న నదికి దేవతలంతా పుష్కరుడితో కలిసి వస్తారు కాబట్టి నదీ స్నానం ఎంతో పుణ్యప్రదమని మన పురాణాలు పేర్కొంటున్నాయి.
పుష్కర స్నానం
నీటిలో రెండు రకాల శక్తులున్నాయంటోంది వేదం. ఒకటి దాహం తీర్చడం, శుభ్రపర్చడం అయితే ఇంకోటి అంతర్ముఖ ప్రక్రియ. అవి మేధ్యం, మార్జనం. మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే పాపాలు పోతాయట. దాన్నే మేధ్యం అంటున్నారు. మార్జనం అంటే నీటిని చల్లుకోవడం. దీని వల్ల ద్రవ్య శుద్ధి జరుగుతుందని అంటున్నాయి పురాణాలు. నీరు నారాయణ స్వరూపం అని ఇందాకే అనుకున్నాం. తీర్ధ స్నానం ఉత్తమం.. దానికన్నా నదీ స్థానం ఇంకా మంచిది. వీటన్నికన్నా పుష్కర స్నానం అత్యుత్తమం. ఒకసారి పుష్కర స్నానం చేస్తే 12 సంవత్సరాలు 12 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఇంత విశేష ఫలాన్ని పుష్కర స్నానం కలుగజేస్తోంది.











