తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ)లో ఇప్పుడో కొత్త వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. నిన్నటిదాకా టీ టీడీపీకి అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోవడంతో టీ టీడీపీకి శని వదిలిందని ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం సంబరాలు చేసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తూ శుక్రవారం రమణ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ విషయం తెలియంగానే పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు భారీ ఎత్తున చేరుకున్న ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
పదవీ కాంక్షతోనే రమణ రాజీనామా
ఈ సందర్భంగా పార్టీకి చెందిన నేత జీవీజీ నాయుడు మాట్లాడుతూ ఐదేళ్లుగా ఎల్.రమణ టీటీడీపీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, అయితే ఏనాడూ పార్టీ పురోభివృద్ధికి పాటు పడలేదని ఆరోపించారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలని చూసినా రమణ నుంచి సహకారం అందేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశం కోసం చూసి పదవి ఎర వేయగానే రమణ పార్టీ నుంచి వెళ్లిపోయిన వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ రాజీనామాతో పార్టీకి పట్టిన శని వదిలిపోయిందని, ఇకపై కొత్త నాయకత్వం నేతృత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన ప్రకటించారు.
రమణది నిష్క్రియాపరత్వమేనట
జీవీజీ నాయుడు ఆరోపించినట్లుగా ఎల్.రమణ ఆధ్వర్యంలో టీటీడీపీ ఏ విషయంలోనూ అంతగా దూకుడుగా వెళ్లలేదనే చెప్పాలి. అంతేకాకుంటా పార్టీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా టీఆర్ఎస్ లోకి చేరిపోతున్నా.. వారిని అడ్డుకోవాల్సిన బాధ్యతను మరిచిన రమణ ప్రేక్షక పాత్ర వహించారన్న ఆరోపణలూ లేకపోలేదు. రమణ నిష్క్రియాపరత్వం కారణంగానే తెలంగాణలో టీడీపీ అంతకంతకూ కృశించిందని, ఇకపై పార్టీని మళ్లీ బలోపేతం చేసుకుంటామని పార్టీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- బాబు అంటే.. టీఆర్ఎస్కు ఇంకా భయమే











