మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 13న విడుదల తేదీ ప్రకటించినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తదుపరి చిత్రం విషయానికొస్తే.. చిరు 153 గా రూపొందే ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది.
ఇక ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోందని వార్తలొచ్చాయి. అలాగే.. మరో ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు సత్యదేవ్ కూడా నటిస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే.. ఇందులో ప్రధానమైన విలన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం ముందుగా విలన్ గా .. బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన కాల్షీట్స్ సమస్యతో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట. దాంతో మేకర్స్ … తమిళ నటుడు ఆర్.మాధవన్ ను ఎంపిక చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
మాధవన్.. ఇంతకు ముందు నాగచైతన్య ‘సవ్యసాచి’లో విలన్ గా నటించినప్పటికీ.. సినిమా పరాజయం పాలవడంతో . ఆయన టాలెంట్ ను ఎవరూ పట్టించుకోలేదు. అలాగే.. అనుష్క నిశ్శబ్దం చిత్రంలో సైతం ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర పోషించారు. ఆ సినిమా లో కూడా ఆయన ఎఫెర్ట్స్ వేస్ట్ అయ్యాయి. అయినప్పటికీ. మహేశ్ బాబు , పరశురామ్ ‘సర్కారువారి పాట’లో ఆయన విలన్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే.. బన్నీ ‘పుష్ప’ మూవీలో కూడా ఆయన ఒక విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవన్ మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో విలన్ గా నటిస్తూండడం విశేషాన్ని సంతరించుకుంది. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ‘కింగ్ మేకర్’ గా మెగాస్టార్ చిరంజీవి ?











